దేశంలోని టార్ సెకెండ్ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్. టీసీఎస్ తర్వాత ఐటీ సేవల రంగంలో అతిపెద్ద సంస్థగా అవతరించిన కంపెనీ ఇటీవల తన ఉద్యోగులకు వేతన పెంపులకు సంబంధించి ఒక శుభవార్త చెప్పింది. అయితే వేతన పెంపుల రోలవుట్ ప్రక్రియకు ముందుగానే నేడు షాకింగ్ విషయం ఒకటి బయటకు రావటంతో ఉద్యోగులు నిరాశకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే తాజాగా కంపెనీ మార్చి చివరి నాటికి ఉద్యోగులకు వేతన పెంపులను అమలు చేయాలని నిర్ణయించింది. కానీ దీనికి ముందు ప్రస్తుతం ఉద్యోగులకు చెల్లించాల్సిన బోనస్ విడుదల చేస్తోంది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసిక కాలానికి ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు చెల్లించాల్సిన బోనస్ విషయంలో భారీగా కోత విధించినట్లు వెల్లడైంది. ఈటీ నివేదిక ప్రకారం కంపెనీ సగటున బోనస్ చెల్లింపును 80 శాతానికి తగ్గించినట్లు తెలిస్తోంది. ఇదే క్రమంలో కంపెనీ డెలివరీ అండ్ సేల్స్ విభాగాల్లో ఉద్యోగులకు వేరియబుల్ వేతనాన్ని గత త్రైమాసికంతో పోల్చితే 10 శాతం తగ్గించినట్లు వెల్లడైంది.

20 నుండి 40 శాతం తగ్గిన చెల్లింపులు
ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న టెక్ దిగ్గజ సంస్థలో దాదాపు 3.23 లక్షల మంది ఉద్యోగులు ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్నారు. హై పెర్ఫార్మెన్స్ పని సంస్కృతిని నిర్మించాలనే లక్ష్యాలకు అనుగుణంగా బోనస్ చెల్లింపులను కూడా ముగించేటప్పుడు మేము పనితీరు భేదాన్ని కొనసాగించినట్లు కంపెనీ తన ఉద్యోగులకు పంపిన మెయిల్ సారాంశం ద్వారా వెల్లడైంది. ఇదే క్రమంలో గత త్రైమాసికంలో కంపెనీ కొందరు ఉద్యోగులకు 100 శాతం పెర్ఫామెన్స్ బోనస్ అందించగా.. ప్రస్తుతం దీనిలో తగ్గింపుల ద్వారా కంపెనీ పెంచిన వేతనాలకు నిధులను ఆదా చేస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి ఫిబ్రవరిలో త్రైమాసిక వేరియబుల్ పే విడుదల చేసిన తర్వాత మార్చిలో జీతాల పెంపుదల రోలవుట్ కానుంది. ఈ క్రమంలో వేరియబుల్ వేతనాల విషయంలో సీనియర్ స్థాయి ఉద్యోగులు 20 నుండి 40 శాతం వరకు తగ్గిన చెల్లింపులను పొందారు. చివరిగా రెండవ త్రైమాసికం అంటే జూలై-సెప్టెంబర్ కాలంలో ఇన్ఫోసిస్ ఉద్యోగులు వారి వేరియబుల్ పేలో దాదాపు 85% అందుకున్నారు.
కొనసాగుతున్న గందరగోళం
మార్కెట్లో పడిపోయిన ఐటీ స్టాక్స్.. నేడు ఇంట్రాడేలో నిఫ్టీ ఐటీ నష్టాలను చూసింది. దీనికి ప్రధాన కారణం ప్రముఖ ఐటీ సేవల కంపెనీ అయిన క్యాప్ జెమినీ ఆదాయాలు అంచనాలను అందుకోలేకపోవటమేనని నిపుణులు చెబుతున్నారు. ఫ్రెంచ్ ఐటీ కంపెనీ అమ్మకాలు 2 శాతం క్షీణతను నమోదు చేయటంతో ఆ ప్రభావం మార్కెట్లోని ఇతర టెక్ కంపెనీలపై కనిపించింది. దీంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా సహా ఇతర స్టాక్ మార్కెట్ లిస్టెడ్ కంపెనీల షేర్లను ఇన్వెస్టర్లు విక్రయించటంతో కొంత గందరగోళం కొనసాగుతోంది.