ఏపిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో దివ్యాంగుల కేటగిరిలో ఇస్తున్న పింఛన్లలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని తేలింది. అయితే నెలకు రూ.6 వేల పింఛను పొందుతున్న వారిలో చాలా మంది అనర్హులు ఉన్నారని గుర్తించినట్లు తెలుస్తోంది. గతంలో రూ.15 వేల పింఛను పొందే వారిలో కూడా ఇలాగే అనర్హులను గుర్తించి తొలగించారు. ఇప్పుడు రూ.6 వేల పింఛను పొందే వారి జాబితాను కూడా పరిశీలిస్తున్నారు. ఆరోగ్య శాఖ, సెర్ఫ్ అధికారులు కలిసి ఫిబ్రవరి నుంచి దివ్యాంగులకు మళ్లీ వైకల్య నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటివరకు 3 లక్షల మందికి పరీక్షలు చేయగా, అందులో 65 వేల మంది అనర్హులుగా తేలినట్లు సమాచారం.
పథకం
రాష్ట్రంలో వైకల్యం ఉన్నవారికి ప్రభుత్వం నెలకు రూ.6 వేలు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద అందిస్తున్నసంగతి తెలిసిందే. ఐదు రకాల వైకల్యాలు ఉన్నవారికి ఈ పింఛను అందజేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 8 లక్షల మంది దివ్యాంగులు ఈ పింఛను పొందుతున్నారు. ప్రభుత్వం లబ్ధిదారులను ఆసుపత్రులకు పిలిచి పరీక్షలు చేయిస్తోంది. వీరిలో సగం మందికి ఆర్థో సమస్యలు ఉన్నాయి. మిగిలిన వారికి ఈఎన్టీ, కంటి చూపు లోపం, మానసిక సమస్యలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఎక్కువ మంది అనర్హులు ఉన్నట్లు గుర్తించారు. ఆర్థో, మానసిక, ఈఎన్టీ సమస్యలున్న వారికి నవంబరు లేదా డిసెంబరు వరకు వైద్య పరీక్షలు చేసే అవకాశం ఉంది. గతంలో రూ.15 వేల పింఛను పొందే వారిలో 7,256 మంది అనర్హులుగా తేలారు. ఇది మొత్తం 24,091 మందిలో జరిగింది. మిగిలిన 70% మందిలో 31.29% మంది మాత్రమే రూ.6 వేల పింఛనుకు అర్హులని తేల్చారు.

దివ్యాంగ
గత ప్రభుత్వంలో డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్లలో చాలా తప్పులు జరిగాయని అధికారులు గుర్తించారు. నిర్ణీత ప్రమాణాల ప్రకారం వైకల్యం లేకున్నా ఉన్నట్లు నిర్ధారించారు. కొంతమందికి 30% వైకల్యం ఉంటే, వారికి 40%, ఆపైన ఉన్నట్లు నమోదు చేయడంతో రూ.6 వేల పింఛన్ పొందేందుకు అర్హత లభించింది అంటున్నారు అధికారులు. అంటే కొందరికి తక్కువ వైకల్యం ఉన్నా ఎక్కువ ఉన్నట్లు చూపించి పింఛను పొందేందుకు అర్హులుగా చేశారు.రాష్ట్రంలో కొత్తగా దివ్యాంగ పింఛను కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈ నెల మొదటి వారం వైద్య పరీక్షలు చేస్తున్నారు. అయితే గతంలో కంటే ఆసుపత్రుల సంఖ్యను తగ్గించారు. దీనివల్ల స్లాట్ బుకింగ్ కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. ఇప్పుడు రూ.6 వేల పింఛను పొందే వారికి కూడా మళ్లీ వైకల్య పరీక్షలు చేస్తుండటంతో వైద్యుల కొరత ఉందంటున్నారు. ఈ కారణంగా కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు ఇబ్బంది పడుతున్నారు.
Read Also: TDP : ఇతిహాసాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. టీడీపీ ప్రతినిధిపై వేటు