తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రస్తుతం అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడతలో సుమారు 4.5 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను ఇన్ఛార్జ్ మంత్రులు ఆమోదించగానే వారి ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు సమాచారం.
ఫస్ట్ ఫేజ్లో ఎంపికైన లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం రూ. లక్ష చొప్పున జమ చేయనుందనే సమాచారం వెలువడింది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదివరకు ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం, ఈ పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని తెలిపింది. అర్హులుగా ఎంపికైన వారికి మంజూరు చేసే సొమ్ము దశల వారీగా అందుతుందని తెలుస్తోంది.

ఇందిరమ్మ ఇళ్లకు అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తోంది. ముఖ్యంగా రేషన్ కార్డుదారులు, పేద కుటుంబాలు, గృహనిరాశ్రయులు మొదలైన వారు ఈ పథకానికి అర్హులుగా పరిగణించబడతారు. స్థానిక అధికారుల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి, అందుకు సంబంధించిన జాబితాను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వ అధికారిక ప్రకటన కోసం లబ్ధిదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పథకానికి అర్హత సాధించేందుకు పెద్ద ఎత్తున దరఖాస్తులు సమర్పించగా, ఇప్పటికే కొన్ని దశల్లో ఎంపిక ప్రక్రియ పూర్తయింది. అధికారిక ప్రకటన వెలువడితే మరింత స్పష్టత రానుంది. ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో రేషన్ కార్డుదారులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రేషన్ కార్డులు, గృహనిరాశ్రయుల వివరాలను పరిశీలించి అర్హులను ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వ భరోసా పథకాలలో ఇది ముఖ్యమైనదిగా భావించబడుతోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.