ఉగ్రవాదులతో సంబంధాలు కలిగిన మోస్ట్వాంటెడ్ గ్యాంగ్స్టర్ హ్యాపీ పాసియా అలియాస్ హర్ప్రీత్ సింగ్ అమెరికాలో పట్టుబడ్డాడు. ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్, ఫెడరల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంయుక్తంగా అరెస్ట్ చేశాయి. ప్రస్తుతం అతడు FBI అదుపులో ఉన్నాడు. ఇతడికి రెండు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నట్లు FBI తెలిపింది. అలాగే అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినట్లు చెప్పింది. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు బర్నర్ ఫోన్లను ఉపయోగించినట్లు వెల్లడించింది. పంజాబ్లో 14 గ్రనేడ్ దాడులతో అతడికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

గ్రనేడ్ దాడుల్లో పాసియా ప్రమేయం
కాగా, గత ఏడు నెలల్లో పంజాబ్లో 16 గ్రనేడ్ దాడులు జరగ్గా అందులో 14 ఘటనలతో పాసియా ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. ముఖ్యంగా పోలీస్ పోస్టులు, ప్రార్థనా మందిరాలపైనే ఎక్కువగా జరిగాయి. ఇటీవల బీజేపీ నేత మనోరంజన్ కాలియాసహా ప్రముఖుల ఇళ్లపై దాడులు జరిగాయి. అయితే, ఈ దర్యాప్తులో హ్యాపీ పాసియా పేరు తెరపైకి వచ్చింది. పాసియాపై 5లక్షల రివార్డ్ కూడా ఉంది.
పాసియాకు నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
2024లో ఛండీగఢ్లో గ్రనేడ్ దాడికి సంబంధించి జనవరి 22న యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్లో మొత్తం 16 చోట్ల NIA తనిఖీలు నిర్వహించింది. అంతకుముందు మాజీ పోలీస్ అధికారి జేఎస్ చాహల్ ఇంటిపై దాడి కేసుకు సంబంధించి ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం పాసియా పేరిట నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ దాడికి పాసియానే పేలుడు పదార్థాలు, ఆయుధాలు, నిధులను సమకూర్చినట్లు వెల్లడించింది.
నలుగురిపై NIA కేసులు
ఈ ఏడాది ప్రారంభంలో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఉగ్రసంస్థకు చెందిన నలుగురిపై NIA కేసులుపెట్టింది. ఈ జాబితాలో పాసియాతోపాటు పాక్కు చెందిన హర్వీందర్ సింగ్ సంధు పేరు కూడా ఉంది. “ఈ దాడులకు రిండా, హ్యాపీ పాసియా రూపుకల్పన చేసినట్లు మా దర్యాప్తులో బయటపడింది. ఇందు కోసం రోహన్ మిషా, విశాల్ మిషాలను నియమించుకోగా, వీరే దాడులు నిర్వహించారు” అని NIA నాడు ఓ ప్రకటనలో చెప్పింది.
Read Also: India: మైనారిటీల హక్కులపై బంగ్లాదేశ్ను హెచ్చరించిన భారత్