అమెరికాలో నివసించే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోన్నారు. కరడుగట్టిన నేరస్తులతో సమానంగా భావిస్తోన్నారు. ఈ విషయంలో భారత్ కూడా మినహాయింపు కాదు. అన్ని దేశాలకు చెందిన అక్రమ వలసదారుల భరతం పడుతున్నారు.అక్రమంగా నివసించే భారతీయులను వెనక్కి పంపించే కార్యక్రమానికి అమెరికా తెర తీసింది కూడా. వారిని ఆ దేశ ప్రభుత్వమే వెనక్కి పంపిస్తోంది. విదేశాంగం- రక్షణ మంత్రత్వ సంయుక్తంగా ఈ ఏరివేతను చేపట్టాయి. తొలి దశలో 205 మంది భారతీయులను మిలటరీ ఎయిర్క్రాఫ్ట్ ఎక్కించింది. మంగళవారమే సీ-17 ఫ్లైట్ టెక్సాస్లోని శాన్ అంటానియో విమానాశ్రయం నుంచి బయలుదేరింది.

కొద్దిసేపటి కిందటే భారత్కు చేరుకుంది. పంజాబ్ అమృత్సర్లోని శ్రీగురు గోవింద్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ ఉదయమే ఈ విమానం వస్తుందని భావించనప్పటికీ- అది వాస్తవ రూపాన్ని దాల్చలేదు. ఈ 205 మంది కోసం అమృత్సర్ విమానాశ్రయంలో ప్రత్యేకంగా ఇమ్మిగ్రెంట్స్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. అమెరికాలో నేరాలకు పాల్పడి ఉండొచ్చనే కారణంతోనే ప్రత్యేకంగా తనిఖీలను నిర్వహించినట్లు గౌరవ్ యాదవ్ తెలిపారు.
వీరిలో 104 మంది అమృత్సర్, సమీప ప్రాంతాలకు చెందిన వాళ్లే. కపుర్తలావాసులు అధికంగా ఉన్నారిందులో. 33 మంది హర్యానా, గుజరాతీయులు. అమృత్సర్ టౌన్- 5, జలంధర్-, పటియాలా-4, హోషియార్పూర్- 2, లూధియానా- 2, ఎస్బీఎస్ నగర్, గుర్దాస్పూర్, తర్న్ తరణ్, సంగ్రూర్, మొహాలి, ఫతేపూర్ సాహిబ్కు చెందిన వాళ్లు ఒక్కొక్కరు ఉన్నారు. ఈ 205 మందిని స్వదేశానికి పంపించడం పట్ల భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం స్పందించింది. అక్రమ వలసదారులను అరికట్టే క్రమంలో దేశ సరిహద్దులను మరింత కట్టుదిట్టం చేసుకుంటోన్నామని తెలిపింది. ఇమ్మిగ్రేషన్స్ చట్టాలను మరింత కఠినతరం చేస్తోన్నామని పేర్కొంది. అక్రమంగా తమ దేశంలో నివసించే వారి పట్ల ఉపేక్షించదలచుకోవట్లేదని తమ ప్రభుత్వం భావిస్తోందని వివరించింది.