Indian fisherman: భారత్కు చెందిన ఓ మత్స్యకారుడు పాకిస్థాన్ కారాగారంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాత్రూమ్లో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఆ జైలు సూపరింటెండెంట్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. భారత్- పాకిస్థాన్ జల సరిహద్దులపై సరిగా అవగాహన లేకుండా చేపల వేటకు వెళ్లి అక్కడి అధికారులకు చిక్కినవారు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా భారత్కు చెందిన మత్స్యకారుడు గౌరవ్రామ్ ఆనంద్ను (52) 2022లో అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్టు చేసి కరాచీ జైల్లో ఉంచారు. నాటినుంచి అతడు అక్కడి కారాగారంలోనే మగ్గిపోతున్నాడు. అయితే.. మంగళవారం రాత్రి బాత్రూమ్లోకి వెళ్లిన మత్స్యకారుడు తాడుతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.

చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసేంతవరకు మృతదేహాన్ని కోల్డ్ స్టోరేజ్లో
అతడు ఎంతసేపటికి బయటకి రాకపోవడంతో అనుమానించిన జైలు అధికారి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసేంతవరకు మృతదేహాన్ని కోల్డ్ స్టోరేజ్లో ఉంచనున్నట్లు పాక్ అధికారులు తెలిపారు. కాగా, గత నెలలో తమ కారాగారంలో ఉన్న 22 మంది మత్స్యకారులను పాక్ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. వారి శిక్షాకాలం పూర్తికావడంతో కరాచీలోని మాలిర్ కారాగారం నుంచి విడుదల చేసింది. మత్స్యకారులు సరిహద్దులను సరిగా గుర్తించకపోవడంతో ఇరువైపులా ఈ అరెస్టులు జరుగుతున్నాయి. ఇదిలాఉంటే.. జనవరి 1న ఇరుదేశాల ఖైదీల జాబితా మార్పిడి జరిగింది. పాకిస్థాన్లో 266 మంది భారత ఖైదీలు ఉన్నారు. భారత జైళ్లలో మొత్తం 462 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు మన దేశ జాబితా పేర్కొంది. తాజాగా ఓ మత్స్యకారుడు జైల్లో ఆత్మహత్యకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది.