భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం చర్చలు ప్రారంభం: ట్రంప్ నుంచి సుంకాలపై కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్, : భారత్–అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. వాషింగ్టన్లో జరిగిన ఈ చర్చల్లో భారత్ తరఫున వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం పాల్గొంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ కొన్ని ఉత్పత్తులపై సుంకాలు తగ్గించనుందనే విషయం తన దృష్టికి వచ్చిందని వెల్లడించారు.ఓవల్ ఆఫీసులో జరిపిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, “భారత్ కొన్ని రకాల వస్తువులపై టారిఫ్ తగ్గించనుందని తెలుసుకున్నా. ఇది మంచి సూచన” అని పేర్కొన్నారు. అయితే, ఏ ఉత్పత్తులపై ఈ తగ్గింపు అమలవుతుందనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు.ఈ చర్చలు ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (Bilateral Trade Agreement – BTA) కింద జరుగుతున్నాయి. ఈ ఒప్పందం అమలవ్వడం వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్యానికి కొత్త దారులు తెరుచుకుంటాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా ఉత్పత్తులకు భారత్లో కొత్త మార్కెట్లు లభించనున్నాయని అమెరికా అధికారికంగా పేర్కొంది.

టారిఫ్ తగ్గింపు దిశగా భారత్–అమెరికా చర్చలు ప్రారంభం
ఇందులో భాగంగా, అమెరికా కూడా కొన్ని టారిఫ్ మరియు టారిఫేతర అడ్డంకులను తగ్గించేందుకు సిద్ధంగా ఉందని యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) స్పష్టం చేశారు. ఇప్పటికే ఒప్పందానికి సంబంధించిన షరతులపై ఇరు దేశాల మధ్య స్పష్టత వచ్చిందని సమాచారం.టారిఫ్ తగ్గింపు అంశం ప్రత్యేకంగా మూడు రోజులపాటు చర్చకు కేంద్రబిందువుగా మారింది. అమెరికా ఇటీవల 90 రోజులపాటు టారిఫ్ అమలును నిలిపివేసిన నేపథ్యంలో ఈ చర్చలకు ప్రాధాన్యత మరింత పెరిగింది.ఈ ఒప్పందం రైతులు, చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులకు కొత్త అవకాశాలు కలిగించే అవకాశం ఉందని ఇరు దేశాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్తో వాణిజ్య చర్చలకు సంబంధించిన కీలక అడుగులు వేయడం, పరస్పర ప్రయోజనాల దృష్ట్యా ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని అంగీకారం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచనుంది.
Read More : India-Pakistan : నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ కాల్పులు.. దీటుగా బదులిస్తున్న భారత్