2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధం అవుతోంది: ప్రధాని మోడీ

India is gearing up to host 2036 Olympics: PM Modi

న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ 2024 ఇటీవలే ఘనంగా ముగిశాయి. ఈ ఒలింపిక్స్‌కు భారత అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వకపోయినా.. పలు రికార్డులు మాత్రం సృష్టించింది. ఇక 2028లో ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు లాస్ ఏంజెల్స్ రెడీ అవుతోంది. అయితే ఆ తర్వాత ఈ క్రీడలు ఎక్కడ జరగనున్నాయనేది చర్చనీయాంశమైన టాపిక్. అయితే ఎంతో కాలంగా ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలని భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధాని మోడీ అన్నారు. విశ్వ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం భారత్‌ కల అని తెలిపారు.

అందుకే 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధం అవుతోందని చెప్పారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీ ఎర్ర కోట వద్ద జెండా ఎగురవేసిన అనంతరం మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్‌ నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేశారు. క్రీడా సంబురానికి ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ రంగం సిద్ధం చేస్తోందని వెల్లడించారు. ఒలింపిక్స్‌లో భారత పతాకాన్ని రెపరెపలాడించిన యంగ్ అథ్లెట్లు మనతోనే ఉన్నారన్న మోడీ.. 140 కోట్ల మంది తరఫున వారందరికీ కంగ్రాట్స్‌ చెబుతున్నానని తెలిపారు. మరికొన్ని రోజుల్లో పారా ఒలింపిక్స్‌లో పోటీ పడేందుకు అథ్లెట్లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.