దాయాది పాకిస్తాన్ దేశానికి దిమ్మతిరిగి పోయే న్యూస్ ఒకటి వెలుగు చూసింది. భారత్తో కయ్యానికి కాలు దువ్వే పాకిస్తాన్.. ఈ వార్త విన్నాక కాస్త జంకాల్సిందే. ఇంతకు పాక్ను అంతలా భయపెట్టే వార్త ఏంటంటే.. ఇప్పటి వరకు తన దగ్గర ఉన్న అణ్వాయుధాలను చూసుకుని విర్రవీగిన పాకిస్తాన్ ఇప్పుడు తోక ముడవాల్సిన పరిస్థితి తలెత్తింది. అణ్వాయుధాల రేసులో భారత్.. దాయాది పాకిస్తాన్ని దాటేసి.. ముందంజలో ఉంది. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్కు చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఇండియా దగ్గర ఉన్న అణ్వాయుధాల సంఖ్య 180కి పెరిగిందని వారు తెలిపారు.

దిగజారిన ఆర్థిక పరిస్థితి
అదే పాకిస్తాన్ విషయానికి వస్తే.. దాయాది దేశం వద్ద ఉన్న అణ్వాయుధాల సంఖ్య 170. అంటే పాక్ కన్నా మన దగ్గరే 10 అణ్వాయుధాలు అధికంగా ఉన్నాయి. 2025 నాటికి పాకిస్థాన్ దగ్గరున్న అణ్వాయుధాల సంఖ్య 200కి చేరుతుందని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ రెండేళ్ల క్రితం అంచనా వేసింది. అయితే ఆర్థిక పరిస్థితి దిగజారడంతో పాకిస్థాన్ వార్ హెడ్లను పెంచుకోలేకపోయిందని భావిస్తున్నారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. మొత్తం 9 దేశాలు అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. ఈ తొమ్మిది దేశాల దగ్గర కలిపి 12,331 అణ్వాయుధాలు ఉన్నాయి. మన పొరుగున ఉన్న చైనా వద్ద ఏకంగా 600 అణ్వాయుధాలున్నాయి.
స్టేట్స్ ఆఫ్ వరల్డ్ న్యూక్లియర్ ఫోర్సెస్ నివేదిక
స్టేట్స్ ఆఫ్ వరల్డ్ న్యూక్లియర్ ఫోర్సెస్ అనే పేరుతో విడుదలైన ఈ నివేదికను పరిశీలిస్తే.. చైనా, భారత్ దేశాలు రెండు క్రమంగా అణ్వాయుధాల సంఖ్యను పెంచుకున్నట్లుగా అర్థం అవుతుంది. అలానే ఉత్తర కొరియా, బ్రిటన్, పాకిస్తాన్, రష్యా దేశాలు న్యూక్లియర్ సామర్థ్యాలను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. తాజా నివేదికల ప్రకారం చూసుకుంటే.. ప్రపంచంలో ఉన్న మొత్తం అణ్వాయుధాల్లో సుమారు 88 శాతం వరకు అమెరికా, రష్యా దేశాల వద్దనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాలను తగ్గించేందుకు జరుగుతున్న కృషి క్రమంగా తగ్గిపోతుంది.
ప్రపంచవ్యాప్తంగా 12,331 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటిల్లో 9604 వార్ హెడ్స్ని క్షిపణులు, యుద్ధ విమానాలు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు వినియోగానికి వాడేలా మిలిటరీ ఆధీనంలో ఉంచారు. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలన్నింటి దగ్గర కలిపి సుమారు 2100 అణ్వాయుధాలున్నట్లు సమాచారం. అత్యంత తక్కువ సమయంలోనే వీటిని వాడి విధ్వంసాన్ని సృష్టించవచ్చు.
ఇక ఇండియా విషయానికి వస్తే..
గతేడాది నాటికి మన దగ్గర ఉన్న అణ్వాయుధాల సంఖ్య 174 కాగా ప్రస్తుతం ఆ సంఖ్య 180కి పెరిగింది. పాకిస్తాన్ దగ్గర మాత్రం 170 అణ్వాయుధాలే ఉన్నాయి. యురేనియం (HEU), ఆయుధ-గ్రేడ్ ప్లూటోనియం ఉత్పత్తి చేయగల అతి కొద్ది దేశాల్లో ఇండియా ఒకటి. హెచ్ఈయూను అణు జలాంతర్గాముల్లో వినియోగిస్తారు. 2023లో ఓ అంతర్జాతీయ పానెల్ ఇండియా దగ్గర అణ్వాయుధాల తయారీ కోసం 680 కిలోల ప్లూటోనియం అందుబాటులో ఉందని అంచనా వేసింది. దీనితో సుమారు 130-210 అణ్వాయుధాలను తయారు చేయగలదని చెప్పుకొచ్చింది. భూమి, గాలి, నీటి ద్వారా అణు దాడులు చేయగల సామర్థ్యం భారతదేశానికి ఉంది. ఇండియా వద్ద అగ్ని సిరీస్ అణు క్షిపణులతో పాటు.. అణు బాంబులను వేయగల మిరాజ్ ఫైటర్ జెట్స్ కూడా ఉన్నాయి. భారత్ మొదటగా 1974లో స్మైలింగ్ బుద్ధ పేరిట అణు పరీక్షలు నిర్వహించగా.. అప్పటి నుంచే పాకిస్థాన్ కూడా అణ్వస్త్రాలు సమకూర్చుకునే పనిలో నిమగ్నమైంది. భారత్ 1998 మే 11, 13 తేదీల్లో పోఖ్రాన్-2 అణు పరీక్షలు నిర్వహించిన రెండు వారాలకే… చాగై-1 పేరిట పాకిస్థాన్ సైతం తొలిసారి అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది.
Read Also: Donald Trump: నాలుగు నెలల్లోనే ట్రంప్కు తగ్గుతున్న ప్రజాదరణ