హైదరాబాద్లో యువత భవిష్యత్తు కోసం ఉద్దేశించిన నిబంధనలు కొందరికి చట్టం చెల్లనట్టే ఉన్నాయి.నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్ పరికరాల అమ్మకంతో నగరంలో ఓ ముఠా ఏకంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంది.అయితే ఈ కుట్రను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGNAB) అధికారులు పోలీసులతో కలిసి భగ్నం చేశారు.అధికారుల విచారణ ప్రకారం, ఈ ముఠా ముఖ్యంగా కాలేజీలు, స్కూల్స్ సమీపంలోనే తమ కార్యకలాపాలను సాగించింది.విద్యార్థులను ఆకర్షించేలా స్మార్ట్ ప్యాకింగ్, సువాసన గల వేప్లతో వ్యసనానికి నెట్టింది. యువత కోరికలపై మోసపూరిత వ్యాపారం నడిపింది.ఈ ముఠా “SID” అనే పేరుతో ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ని సృష్టించింది. అందులో సభ్యులుగా చేరిన వారందరికీ ఈ-సిగరెట్లు, వేపింగ్ పరికరాలు గుప్తంగా పంపించేవారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ గ్రూప్లో దాదాపు 500 మందికి పైగా వినియోగదారులు ఉన్నట్లు గుర్తించారు.ఇది యువతపై ఎంతగా ప్రభావం చూపిందో అక్కడి నుంచే అర్థం అవుతుంది.

అరెస్టైన నిందితులు నాంపల్లి ప్రాంతానికి చెందిన అన్నదమ్ములు.వీరికి ఢిల్లీకి చెందిన అమిత్, ముంబైకి చెందిన వసీమ్ అనే వ్యక్తులు పెద్దమొత్తంలో సరఫరా చేస్తున్నట్టు తేలింది.ఇలా దేశవ్యాప్తంగా నిషేధిత పదార్థాలను తెచ్చి నగరంలో అమ్ముతున్న ఈ ముఠా అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్క్ ఏర్పరచుకుంది.ఈ దాడిలో అధికారులు భారీగా సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ. 25 లక్షల విలువైన ఈ-సిగరెట్లు, వేపింగ్ పరికరాలు, లిక్విడ్లు అధికారులు సీజ్ చేశారు. వీటితో పాటు విదేశీ కరెన్సీగా 225 అమెరికన్ డాలర్లు, 100 కెనడియన్ డాలర్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో జరిగే అక్రమ వాణిజ్యానికి నిదర్శనం.ఇది లైట్గా తీసుకునే అంశం కాదు. వేప్ల రూపంలో యువతలో వ్యసనాన్ని పెంచే ప్రయత్నం సుదీర్ఘంగా కొనసాగుతుందన్న విషయం ఈ ఘటనతో బహిర్గతమైంది.
విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తును బలిపశువుగా మలచే వారి ప్రయత్నాలను ఖండించాల్సిన అవసరం ఉంది.ఈ సందర్భంలో తల్లిదండ్రులు, విద్యాసంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు ఎలాంటి ప్రవర్తన చూపుతున్నారు? ఎవరి సాంగత్యం లో ఉన్నారు? అనే విషయాల్లో స్పష్టమైన అవగాహన అవసరం. ఇటువంటి వ్యసనాలు వారు అలవాటుపర్చుకునే ముందే ఆపడం అత్యవసరం.
Read Also : Telangana: డ్రైవింగ్ లైసెన్స్ మరింత సులభంగా రెన్యువల్