అమెరికాలో ఇచ్ఛాపురం విద్యార్థి మృతి..
శ్రీకాకుళం(D) ఇచ్ఛాపురానికి చెందిన రూపక్ రెడ్డి(26) అమెరికాలో మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంనకు చెందిన పి రూపక్రెడ్డి ఎమ్మెస్ కోసం 8 నెలల క్రితం అమెరికా వెళ్లారు. డెలవేర్లో ఉంటూ హరిస్ బర్గ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎమ్మెస్ చేస్తున్నారు.
రూపక్ మంగళవారం సాయంత్రం తన స్నేహితులు ఐదుగురితో కలసి ఓ సరస్సులో బోటింగ్ కోసం వెళ్లారు. అయితే రూపక్ సరస్సు మధ్యలో ఉన్న రాయిపైకి ఎక్కి ఫొటోలు తీసుకుంటుండగా.. అతడితో పాటు స్నేహితుడు రాజీవ్ సరస్సులోకి జారిపడ్డారు. వెంటనే అప్రమత్తం అయిన మిగిలిన స్నేహితులు రాజీవ్ను రక్షించినా, రూపక్ను మాత్రం కాపాడలేకపోయారు. ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడి పోలీసులకు ఫోన్లో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత రెస్క్యూ టీమ్ గాలించగా రూపక్ రెడ్డి మృతదేహం లభించింది.