శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. బుధవారం రాత్రి 10:56 గంటలకు భూమి కుదుపుకు గురైనట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రకంపనలు సుమారు 2 సెకన్ల పాటు కొనసాగినట్లు తెలిపారు, ఆ సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూమి కంపించిన ఘటన రాత్రితో ముగియలేదు. గురువారం తెల్లవారుజామున 4:55 గంటల సమయంలో మరోసారి స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
ఇది ప్రజల్లో మరింత ఆందోళనను పెంచింది. ప్రకంపనల తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, భవనాలు కొద్దిగా కదిలినట్లు స్థానికులు చెప్పుకొచ్చారు. ఈ క్రమములో ఇచ్ఛాపురం ప్రజలు గత అనుభవాలను గుర్తుచేసుకున్నారు. రెండు సంవత్సరాల క్రితం, అక్టోబర్ నెలలో ఇలాంటి స్వల్ప భూ ప్రకంపనలు జరిగినట్లు తెలిపారు. అప్పటి ఘటనలో కూడా ప్రజలు ఇలాగే ఆందోళనకు గురయ్యారు. ఇది ఈ ప్రాంతంలో భూకంపాలకు సంబంధించిన చరిత్ర ఉందని సంకేతాలను ఇస్తోంది. ఈ ఘటనల నేపథ్యంలో భూవిజ్ఞాన శాఖ పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. భూకంప తీవ్రతను, ప్రభావాన్ని అంచనా వేయడానికి సంబంధిత అధికారులు పరిశీలన చేపట్టారు. భూకంప కేంద్రం సమీప ప్రాంతాల్లోనే ఉందా, లేక ఇతర ప్రాంతాల ప్రభావమా అన్న విషయాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.