తెలంగాణ ఎన్నికల కమిషనర్గా రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల కమిషనర్గా రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్ రాణి కుముదిని నియమితులయ్యారు. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ పార్థసారధి పదవీకాలం ఈ నెల 8న ముగిసింది. దాంతో ఆయన స్థానంలో రాణి కుముదినిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదేశాలు జారీ చేశారు. మూడేళ్లు ఆమె ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, 1988 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన కుమిదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.
కేంద్ర సర్వీసుల అనంతరం తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పదవీ విరమణ చేశారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొత్త ఎన్నికల కమిషనర్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.