ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పిసిపల్లి మండలం దివాకరపురంలో రిలయన్స్ సంస్థ ఆధ్వర్యాన ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంటుకు మంత్రి లోకేశ్ బుధవారం భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు చెప్పిన పీ4 విధానానికి రిలయన్స్ సీబీజీ ప్లాంట్స్ నాంది కాబోతున్నాయని, పేదరికం లేకుండా చేయడంలో ఇదొక ముఖ్యమైన అడుగు కాబోతోందని తెలిపారు.
బయో గ్యాస్
ఏపీలో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్స్ పెట్టడానికి రిలయన్స్ ముందుకు వచ్చింది. ఈ రంగంలో 65 వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. దీని ద్వారా 500 ప్లాంట్లు పెట్టడానికి రిలయన్స్ ముందుకు వచ్చింది. తద్వారా 2.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, కడపలో 5 లక్షల ఎకరాల బీడు భూమిని వినియోగంలోకి తీసుకురాబోతున్నాం. యువగళం సమయం లో ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాను. రిలయన్స్ మొదటి సీబీజీ ప్లాంట్ ను కనిగిరిలో ప్రారంభించాను. ప్రకాశం జిల్లాలో ఐదు వేల ఎకరాలు బీడు భూములు ఇచ్చాం. కనిగిరిలో 497 ఎకరాలు కేటాయించాం. కనిగిరి ప్లాంట్ రిలయన్స్ సీబీజీ ప్లాంట్ హబ్ గా మారబోతుంది. ఇక్కడే ఐదు ప్లాంట్స్ రాబోతున్నాయి.
ఉమ్మడి ప్రకాశం
ఇక్కడి ప్రజలకు పౌరుషం, ప్రేమ ఎక్కువే. ప్రకాశం జిల్లా ప్రజలకు టీడీపీ అన్నా, చంద్రబాబు అన్నా ఎనలేని ప్రేమ. 2019లో ఎదురుగాలి ఉన్నా టీడీపీని నాలుగు సీట్లలో గెలిపించారు. 2024 లో 10 సీట్లలో టీడీపీ అభ్యర్థులకు ఘన విజయాన్ని చేకూర్చారు. యువగళం పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ ప్రజల కష్టాలు చూశాను. ప్రకాశం జిల్లాలో యువగళం ఒక ప్రభంజనంగా మారింది. నేను ఆ రోజే చెప్పా, మీరు చూపించిన ప్రేమకు రెండింతలు తిరిగి ఇస్తానని. ప్రకాశం జిల్లా నా గుండెల్లో ఉంటుంది అని. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టు బట్టలతో మనం ప్రయాణం ప్రారంభించాం. అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా ప్రకటించాం. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ ఎజెండాగా పనిచేశాం. అనంతపురంను ఆటోమొబైల్ హబ్ చేశాం. చిత్తూరు, కడపలో ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలు తీసుకొచ్చాం. కర్నూలుకు రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీలు తీసుకొచ్చాం. ప్రకాశం జిల్లాకు అతిపెద్ద పేపర్ మిల్ తీసుకొస్తే ఆ కంపెనీని గత ప్రభుత్వం రానివ్వలేదు. ఉభయగోదావరి జిల్లాలను ఆక్వా రంగంలో నంబర్-1గా నిలబెట్టాం. ఉత్తరాంధ్రను ఐటీ, ఫార్మా హబ్ గా తయారు చేశాం.

ఆర్గానిక్ ఎరువు
నీటివసతి లేని మెట్టప్రాంతంలోని రైతులకు ఈ ప్లాంట్స్ ద్వారా పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది. నైపర్ గడ్డితో గ్యాస్ తయారు చెయ్యబోతున్నారు. ప్రభుత్వ భూములకు 15 వేలు, రైతుల భూములకు రూ. 31 వేలు కౌలు కూడా ఇవ్వబోతున్నారు. రైతులే గడ్డి పెంచి ఇస్తే టన్నుకు నిర్ణీత ధర చెల్లిస్తారు. రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేసే సీబీజీ ప్లాంట్లన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తే ఏటా 110 లక్షల మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ ఎరువు కూడా తయారు అవుతుంది. ఈ ప్లాంట్ల ద్వారా గ్రామీణ యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయి. నేను ప్రకాశం జిల్లా వచ్చిన ప్రతీ సారి మీరు చూపించే ప్రేమ, ఆప్యాయత నేను మర్చిపోలేను. ప్రకాశం జిల్లాలో పేదరికం లేకుండా చెయ్యడమే మా లక్ష్యం. రానున్న అయిదేళ్లలో ఆ లక్ష్యాన్ని సాధించి తీరుతాం.
50 ప్లాంట్లు
యువగళం సమయంలో సాయంత్రం సరదాగా కూర్చుని మాట్లాడుకునేవాళ్లం. మన ప్రాంతంలో ఏం మార్పుతేవాలనే విషయమై చర్చించేవాళ్లం. మా ప్రాంతంలో వలసలకు చెక్ పెట్టాలని ఉగ్ర నరసింహారెడ్డి చెప్పారు. అది గుర్తుపెట్టుకొని నేను, గొట్టిపాటి మొదటి సీబీజీ ప్లాంట్ కనిగిరిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. రిలయన్స్ ఆధ్వర్యాన మొదటి వంద సీబీజీ ప్లాంట్లు ప్రకాశం జిల్లాకు తేవాలని నిర్ణయించాం. ఈ ప్రాంత రైతులు 50 వేల ఎకరాలు కౌలుకు ఇస్తారని చెప్పారు. చెప్పిన ప్రకారం భూములిస్తే ఇక్కడే 50 ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం.కనిగిరి ప్రజల కోసం ఆయన కష్టపడ్డారు. ఇక్కడ ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు కల్పించాలని ఆయన కృషి చేస్తున్నారు.
ట్రిపుల్ ఐటీ
నాపై చూపిన ప్రేమ, అభిమానం ఎప్పుడూ మర్చిపోను. కనిగిరిలో ట్రిపుల్ ఐటీకి త్వరలోనే శంకుస్థాపన చేస్తా. కనిగిరి రైల్వే ప్రాజెక్టుకు ఏప్రిల్ లో అవసరమైన నిధులిస్తాం. ఆగస్టులో సీఎంను రప్పించి రైల్వేప్రాజెక్టు పనులు ప్రారంభిస్తాం. మిగిలిపోయిన వెలుగొండ పనులు పూర్తిచేసి చివరి ఎకరాకు సైతం సాగునీరు అందిస్తాం. తాగునీటి శాఖ మంత్రి, నా సోదరుడు పవనన్న కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించి ఆగిపోయిన జల్ జీవన్ మిషన్ పనులను ప్రారంభించారు. రాబోయే రోజుల్లో ప్రతిగడపకు తాగునీరు అందిస్తాం. వైసీపీ నాయకుల దుష్ప్రచారం చూస్తుంటే జాలివేస్తోంది. వారు చేయరు, చేసేవాళ్లను చేయనీయరు. బయోగ్యాస్ ప్లాంటుపై అపోహలు సృష్టిస్తున్నారు. అనవసరంగా అడ్డుపడితే ఎర్రబుక్ లోకి ఎక్కుతారు. నేను మంచి పనిచేయడానికి వచ్చా. అధికారంలోకి వచ్చిన 10నెలల్లోనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో ప్రకాశం జిల్లాకు వచ్చా. తప్పుడు ప్రచారం చేస్తే ఎవరినీ వదిలిపెట్టను.