పవన్‌ కళ్యాణ్‌కు రూ.3లక్షలు విరాళం అందజేసిన హైపర్ ఆది..

Hyper Aadi donates Rs.3 lakhs to Pawan Kalyan..

అమరావతి: ప్రముఖ సినీ కమెడియన్, జబర్దస్త్ ఆర్టిస్టు హైపర్ ఆది తన మంచి మనసును చాటుకున్నాడు. ఇటీవల ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు చాలా నష్టపోయాయి. ముఖ్యంగా అటు విజయవాడ, ఇటు ఖమ్మం జిల్లా ప్రజలు ముంపు బాధితులుగా మారారు. సర్వం కోల్పోయి ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వారికి సాయం ప్రకటించాయి.

ఈ క్రమంలోనే సినీ,వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులు సైతం ముందుకు వచ్చి వరద సాయం ప్రకటిస్తున్నారు. తాజాగా కమెడియన్ హైపర్ ఆది ఏపీలోని వరద బాధితుల కోసం రూ.3 లక్షలను విరాళం ప్రకటించారు. దానికి సంబంధించిన చెక్‌ను స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసి అందజేశారు. వరదల కారణంగా నష్టపోయిన పంచాయతీలకు ఈ విరాళాన్ని అందించాలని కోరారు. ఎకె మల్లవరం (పిఠాపురం నియోజకవర్గం) రూ.లక్ష, మిగతా రూ.2 లక్షలు తన సొంత గ్రామమైన పల్లాపల్లి గ్రామ పంచాయతీ (ప్రకాశం జిల్లా) కోసం అందజేశారు.హైపర్ ఆది మాట్లాడుతూ.. వరద బాధితుల కోసం రూ.6 కోట్లు విరాళం ఇచ్చి పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరీలో స్ఫూర్తిని నింపారు. ఆ స్ఫూర్తితోనే నా వంతుగా రూ.3 లక్షలు ఇచ్చానని ఆది చెప్పుకొచ్చాడు.