ఒడిశాలో హైదరాబాద్ యాత్రికుల బస్సుకు ప్రమాదం

హైదరాబాద్ నుంచి ఉత్తరాదిలో తీర్థయాత్రకు ట్రావెల్స్ బస్సులో వెళ్తుండగా.. దురదృష్టవశాత్తూ వారి వాహనం ఒడిశాలో ప్రమాదానికి గురియ్యింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్టు సమాచారం. వీరంతా హైదరాబాద్ పాతబస్తీలోని ఛత్రినాకకు చెందిన వారని తెలుస్తుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదం ఒడిశాలో శనివారం ఉదయం జాతీయ రహదారి 18పై జరిగింది. వీరంతా ఉత్తర భారతంలోని కాశీ, గయ వంటి పుణ్యక్షేత్రాల దర్శనం కోసం వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు బస్సు ఓవైపున పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్స్ తెలిపారు.