హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మంగళవారం జరిగిన పోలింగ్లో మొత్తం 112 ఓటర్లలో 88 మంది ఓటు హక్కు వినియోగించగా, విజయం కోసం కనీసం 45 ఓట్లు అవసరం. ప్రధానంగా AIMIM పార్టీ అభ్యర్థి మీర్జా రియాజ్ మరియు బీజేపీ అభ్యర్థి గౌతంరావు మధ్య పోటీ నెలకొంది.
రియాజ్ గెలుపు లాంఛనమనే భావన
అయితే రాజకీయ సమీకరణాలను పరిశీలిస్తే, రియాజ్ గెలుపు లాంఛనమనే భావన రాజకీయ వర్గాల్లో నెలకొంది. AIMIMకి ఇప్పటికే 50 ఓట్లు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి చెందిన 14 ఓట్ల మద్దతు కూడా రియాజ్కు లభించడంతో ఆయన విజయానికి ఎలాంటి అడ్డంకులూ లేకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి గౌతంరావు పోటీలో ఉన్నప్పటికీ గెలుపు అవకాశాలు మినిమమ్గా కనిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన 24 మంది సభ్యులు ఓటింగ్కు దూరం
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 24 మంది సభ్యులు ఓటింగ్కు దూరంగా ఉండటం గమనార్హం. దీనివల్ల పోటీ పక్కా రెండుపక్షాల మధ్యే జరిగి రియాజ్కు అనుకూలంగా మారింది. ఉదయం 10 గంటలలోపే అధికారిక ఫలితం వెలువడనుందని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో AIMIM ప్రభావం మరోసారి ప్రభలినట్టుగా కనిపిస్తోంది.