నంద్యాల జిల్లాలో నిద్రమత్తులో రైలు నుంచి జారిపడ్డ భార్య, భర్త

రైలు లో ఫుట్‌బోర్డు ప్రయాణం ప్రమాదకరం అని ఎంతమంది చెప్పిన చాలామంది అలాగే ప్రయాణం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ముఖ్యంగా రాత్రి సమయంలో అస్సలు చేయకూడదు..నిద్ర మెట్టలో జారిపడిన ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా శుక్రవారం రాత్రి నంద్యాల జిల్లాలో అదే జరిగింది. నిద్ర మత్తులో జారిపడిన భార్యను కాపాడపోయి..భర్త రైలు నుండి దూకి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో సయ్యద్ ఆసిఫ్, ఆయన భార్య ఆసియాబాను ఫుట్‌బోర్డుపై కూర్చుని ప్రయాణించారు. రైలు ఎర్రగుంట్ల మీదుగా వెళుతున్న సమయంలో నిద్రమత్తులో ఉన్న ఆసియాబాను రైలు నుంచి జారి కిందపడింది. ఇది గమనించిన వెంటనే భార్యను కాపాడేందుకు రైలు నుంచి దూకిన ఆసిఫ్ మృతిచెందాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన మహిళను చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులను కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లా చిరూరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. నాలుగు నెలల క్రితమే ఆ జంట ప్రేమ వివాహం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. గుంటూరు నుంచి బెంగళూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.