జగన్ పోలీసు వ్యవస్థను నాశనం చేసారు – హోంమంత్రి

వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవడానికే రెడ్ బుక్ అని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. వైజాగ్ సీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో ఆమె సమావేశమయ్యారు. తాను సోషల్ మీడియా బాధితురాలినేనని తెలిపారు. అసభ్య పోస్టులపై చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారని దుయ్య బట్టారు. పోలీసులను కేవలం బందోబస్తుకే వాడారని, పోలీసు అకాడమీ, గ్రేహౌండ్స్ అకాడమీ కూడా లేదని, కేంద్రం నుంచి నిధులు వచ్చినా పోలీసు అకాడమీ నిర్మాణాలు చేయలేదని అనిత చెప్పుకొచ్చారు.

ఈ 12 రోజుల్లో చాలా అంశాలపై పరిశీలన చేశానని, గంజాయి రవాణా రాష్ట్రంలో బాగా పెరిగిందని, నేషనల్ క్రైం రికార్డులో ఏపీని మూడో స్థానంలోకి తెచ్చారని అన్నారు. నేటికీ విశాఖ జిల్లాలో ఒక పోలీస్టేషన్ రేకుల షెడ్‌లో నడుస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏడాదికి రూ. 50 కోట్లు చొప్పున రూ.250 కోట్లు పోలీసు శాఖకు రావాలని అన్నారు.