షెడ్యూల్ కులాలకు చెందిన వారు మతం మారి కూడా తమ ఎస్సీ హోదాను దుర్వినియోగం చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏపీ హైకోర్టు తాజాగా ఓ కీలక తీర్పు వెలువరించింది. ఎస్సీలు మతం మారి వేరే మతంలోకి వెళ్తే వారికి ఉన్న హోదా రద్దవుతుందని తేల్చిచెప్పింది. దీంతో రాష్ట్రంలో మతం మారాలనుకునే ఎస్సీలకు ఇది శరాఘాతంగా మారబోతోంది. అలాగే మత మార్పిడులకు కూడా చెక్ పడనుంది.బాపట్ల జిల్లాకు చెందిన ఎస్సీ అయిన ఆనంద్ అనే పాస్టర్ తాను నిర్వహిస్తున్న చర్చి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న కొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2021లో చందోలు పోలీసులకు అట్రాసిటీ చట్టం కింద వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. తాను మతం మారిన విషయాన్ని చెప్పకుండా ఎస్సీలకు వర్తించే అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు కోరాడు. దీంతో పోలీసులు కూడా మతం మారిన విషయం పట్టించుకోకుండా అతని ఫిర్యాదు ప్రకారం అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

నేపథ్యం
ఈ వ్యవహారంపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఎస్సీలు మతం మారిన రోజే వారి ఎస్సీ హోదా రద్దవుతుందని తేల్చిచెప్పింది. కాబట్టి పోలీసులు పాస్టర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి ఛార్జిషీట్ వేయకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. ఈ కేసును కొట్టేస్తూ కీలక తీర్పు ఇచ్చింది. దీంతో ప్రస్తుతం గుంటూరు ఎస్సీ, ఎస్టీ కేసుల్ని విచారిస్తున్న కోర్టులో ఉన్న ఈ కేసును మూసేయాల్సి ఉంటుంది.రాష్ట్రంలో మతమార్పిడులు పెరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు కీలకంగా మారింది. ముఖ్యంగా ఎస్సీలుగా ఉంటూ మతం మార్చుకుని అట్రాసిటీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదులు చేస్తున్న వారికి హైకోర్టు తీర్పు షాకిచ్చింది. హైకోర్టు తీర్పుతో ఇలాంటి మరిన్ని కేసులు ముుందుకు రావొచ్చని తెలుస్తోంది. అలాగే పోలీసులు కూడా మరోసారి ఇలాంటి కేసులు నమోదు చేయకుండా అడ్డుకట్ట వేసినట్లయింది.
Read Also: Vande Bharat: ఏపి, తెలంగాణలో రెండు వందేభారత్ స్లీపర్లు ఖాయం