నితీశ్ ఎన్నికను సవాల్ చేస్తూ పిటిషన్.. కొట్టేసిన హైకోర్టు
న్యూఢిల్లీ: బీహార్ సీఎం నితీశ్ కుమార్ ను జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడిగా ఎన్నుకోవడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పరిశీలించిన ధర్మాసనం ఈ పిటిషన్ను కొట్టివేసింది. జేడీయూ నుంచి బహిష్కరణకు గురైన గోవింద్ యాదవ్, పార్టీ చీఫ్గా నితీశ్ కుమార్ ఎన్నిక కావడాన్ని ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29ఏ(9)కు అనుగుణంగా ఆయన ఎన్నిక జరుగలేదని ఆరోపించారు.
కాగా, జస్టిస్ పుష్పేందర్ కుమార్ కౌరవ్తో కూడిన ధర్మాసనం ఆగస్ట్ 29న ఈ పిటిషన్పై విచారణ జరిపింది. పిటిషనర్ పేర్కొన్న అంశాలు విచారణ పరిధికి పూర్తి దూరంగా ఉన్నాయని తెలిపింది. గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఈ పిటిషన్కు వర్తించవని పేర్కొంది. ఎన్నికల ఫలితాల్లో కోర్టు జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది. పిటిషన్ మెరిట్ లేనిదిగా పరిగణించిన ఢిల్లీ హైకోర్టు దానిని డిస్మిస్ చేసింది.