న్యూఢిల్లీ: చలితో ఉత్తర భారతం గజగజా వణికిపోతుంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యటక ప్రాంతమైన మనాలీపై మంచు కమ్మేసింది. హిమపాతం భారీగా ఉండటంతో పర్యటకులు నానా అవస్థలు పడుతున్నారు. రోహ్తంగ్లోని సొలాంగ్, అటల్ టన్నెల్ల మధ్య సోమవారం రాత్రి తర్వాత దాదాపు 1000కి పైగా వెహికిల్స్ చిక్కుకుపోయాయి. దీంతో అలర్టైన పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. అయితే, గత కొన్ని రోజులుగా భారీగా మంచు కురుస్తుండటంతో మనాలీకి టూరిస్టులు పోటెత్తారు. ఇక, నిన్న (డిసెంబర్ 23) సాయంత్రం నుంచి వాతావరణం మారిపోయింది. దట్టమైన మంచు కురుస్తుండటంతో ఎదురుగా ఉన్న వాహనాలు కన్పించని పరిస్థితి నెలకొంది.
దీంతో వెహికిల్స్ ముందుకు వెళ్లలేక భారీగా ట్రాఫిక్ అయ్యింది. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తు్న్నారు. ఇప్పటి వరకు 700 మంది టూరిస్టులను సురక్షిత ప్రాంతాలకు పంపించారు. ప్రస్తుతం అటల్ టన్నెల్ మార్గంలో వాహనాల రాకపోకలు స్లోగా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లాలోనూ భారీగా మంచు కురుస్తోంది. హిమపాతం వల్ల రాష్ట్రంలోని పలు రోడ్లను అధికారులు తాత్కాలికంగా బంద్ చేశారు. క్రిస్మస్, కొత్త సంవత్సరం నేపథ్యంలో ఏటా డిసెంబర్ చివరి వారంలో మనాలీకి పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. గత కొద్ది రోజులుగా వేల సంఖ్యలో వాహనాలు ఈ ప్రాంతానికి వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.