ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. కొన్ని జిల్లాల్లో భగ్గుమంటూ ఎండలు పొగలు వేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వరుణుడు విరుచుకుపడుతున్నాడు. ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు కీలక సూచనలు చేసింది. శనివారం రోజున రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే బయటకు వెళ్లకుండా ఉండాలని ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం
అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పిడుగులు పడే అవకాశముండటంతో రైతులు, గిరిజన ప్రాంతాల్లో నివసించే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే సూచనలు కనిపిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 73 మండలాలు వడగాలుల ప్రభావం
ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని కొన్ని మండలాల్లో శనివారం తీవ్రమైన వడగాలులు ఉంటాయని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 73 మండలాలు వడగాలుల ప్రభావానికి గురికావచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఎండల తీవ్రత వల్ల డీహైడ్రేషన్కు గురికాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 36.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాబోయే 24 గంటలు ఏపీవాసులకు కీలకంగా మారనున్నాయి.