ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బలమైన ఈదురుగాలులు, పిడుగులు రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించాయి. పిడుగుల కారణంగా వివిధ ప్రాంతాల్లో ప్రాణ నష్టం సంభవించింది. తిరుపతి జిల్లాలో ముగ్గురు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు మృతి చెందారు. అలాగే ఏలూరు జిల్లాలో పిడుగుపాటుకు ఒకరు మరణించగా, మరొకరు చెట్టు కింద పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలతో మొత్తం మృతుల సంఖ్య 8కి చేరుకుంది.
అకాల వర్షాలతో ప్రాణ , ఆస్తి నష్టాలు
ఈ వర్షాలు కేవలం ప్రాణ నష్టాన్ని కాకుండా, ఆర్థికంగా కూడా రైతులను తీవ్రంగా నష్టపెట్టాయి. ధాన్యం కోత పూర్తయ్యే సమయంలో ఈ వర్షాలు రావడంతో, భద్రపరిచిన ధాన్యం తడిసిపోయి నాణ్యత కోల్పోయింది. ఇదే విధంగా అరటి, బొప్పాయి, మామిడి పంటలు ఈదురుగాలులతో నేలరాలిపోయాయి. దీంతో పంటలపై పెట్టుబడి వేసిన రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు నష్టాన్ని అంచనా వేసేందుకు సంబంధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనలపై గమనించి, తక్షణ సహాయ చర్యలు ప్రారంభించినట్టు సమాచారం. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. మరోవైపు ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఇంకా మెరుగుపడలేదని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Read Also : India : రష్యా నుంచి ఇగ్లా-ఎస్ స్వల్ప శ్రేణి క్షిపణుల సేకరణ