జాగ్రత్త.. తెలంగాణాలో ఈరోజు, రేపు అతిభారీ వర్షాలు
తెలంగాణలో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతవారణ కేంద్రం తెలిపింది. ఈరోజు జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. నిన్న మహబూబాబాద్, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.
మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 18.25 సెం.మీ., ఖమ్మం జిల్లా తల్లాడలో 12.15 సెం.మీ., భద్రాద్రి జిల్లా మద్దుకూరులో 9.23 సెం.మీ., ఖమ్మం జిల్లా మంచుకొండలో 9 సెం.మీ., రఘునాథపాలెంలో 8.9 సెం.మీ., మహబూబాబాద్ జిల్లా గార్లలో 8.1 సెం.మీ., భద్రాద్రి జిల్లా పెంట్లంలో 8 సెం.మీ., వికారాబాద్ జిల్లా ధవలాపూర్లో 8 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురియడంతో మున్నేరు వరద పోటెత్తింది. వరదల కారణంగా ముంపు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ముంపు బాధితులకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు.