జలదిగ్బంధంలో మహబూబాబాద్‌ జిల్లా

మహబూబాబాద్‌ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు ఉప్పొంగిప్రవహిస్తున్నాయి. జిల్లా కేంద్రం నుంచి బయటకు వెళ్లే దారులన్నీ మూసుకుపోయాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఇల్లందు, నెల్లికుదురు, కేసముద్రం వైపు రవాణా సౌకర్యం నిలిచిపోయాయి. కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి, ఇంటికన్నె మధ్య ఎగువ, దిగువ మార్గాల్లో రైల్వేట్రాక్ కింద కంకర కొట్టుకోయింది. దీంతో మట్టి కోతకు గురవడంతో ట్రాక్‌ కింది నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో విజయవాడ- కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. తాళ్లపూసలపల్లి వద్ద రైల్వేట్రాక్‌పై నుంచి వరద ప్రవహిస్తుండటంతో పందిపల్లి వద్ద మహబూబ్‌నగర్‌-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ 4 గంటల పాటు నిలిచిపోయింది.

మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌లో మచిలీపట్నం, సింహపురి రైళ్లు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు ఎగిపోవడంతో ఇండ్లలోకి వర్షం నీరు చేరింది. కురవి మండలం నల్లెల్ల , మోదుగుల గూడెం ఇళ్లలోకి వరద చేరింది. ఇండ్లపైకి ఎక్కిన జనాలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. తమను కాపాడాలంటూ బంధువులకు ఫోన్లు చేస్తున్నారు. ఇక రాజుల కొత్తపల్లి చెరువుకట్ట తెగడంతో నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. అదేవిధంగా నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలో అన్నా స్వామి కుంట కట్ట తెగిపోవడంతో రోడ్డు కోతకు గురయింది. గూడూరు శివారులో పాకాల వాగు పొంగి ప్రవహిస్తున్నది. దీంతో గూడూరు, కేసముద్రం, నెక్కొండ, గార్ల, రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.