ఏపీలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనికి తోడు భారీ ఈదురు గాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో భారీ చెట్లు కుప్పకూలాయి. కోస్తా ఆంధ్రాలోని అల్లూరి, విశాఖ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గాలివానకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. రహదారులపై వృక్షాలు నేలకూలాయి. కంకిపాడు ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేల కూలడంతో వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ నగరంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచింది. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. చాలా రోజులుగా వేసవి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న విజయవాడ వాసులకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది.
ఆనందం
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో వృక్షాలు నేలకూలాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పట్టణంలోని రహదారులు జలమయమయ్యాయి. ఉండి, భీమవరం, ఆకివీడు, కాళ్ల మండలాలల్లో ఆరబెట్టిన ధాన్యం రాసులు వర్షానికి తడిసి ముద్దమడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏలూరు జిల్లా పోలవరం, జంగారెడ్డిగూడెం నియోజకవర్గాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షంతో జనజీవనం స్తంభించింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. వర్షాలతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు వేసవితాపం నుంచి ఉపశమనం పొందారు.కోనసీమ జిల్లాలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. అమలాపురం, అంబాజీపేట, అయినవల్లి, మామిడికుదురు, కొత్తపేట, పి.గన్నవరం మండలాల్లో జోరు వాన కురిసింది. వర్షం కురవడంపై కొబ్బరి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షానికి ధాన్యం తడవడంతో వరి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిప్రాంతాల్లో పొలాల్లో కోతకోసి ఆరబెట్టిన ధాన్యం తడవకుండా రైతులు పట్టలు కప్పుతున్నారు.

వాతావరణం
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో అకస్మాత్తుగా వచ్చిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం అల్లకల్లోలం సృష్టించింది. శనివారం సాయంత్రం వరకు తీవ్రమైన ఎండ కాయగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. మబ్బులు దట్టంగా అలముకుని చీకటిని తలపించింది. వెంటనే వర్షం మొదలయ్యింది. దాదాపు అరగంట పాటు కుంభవృష్టిని తలపించిన వర్షానికి, భారీ ఈదురుగాలులు తోడవడంతో జనాలు బెంబేలెత్తిపోయారు. రహదారులపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోగా, రోడ్లన్నీ జలమయమయ్యాయి. గాలుల తీవ్రతకు నక్కపల్లి కాగిత, రాజయ్యపేట, ఉపమాక తదితర గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల మామిడి జీడి పంటకు నష్టం వాటిల్లింది.
Read Also: Andhra Pradesh: గుంటూరులో కొత్తగా మరో ఫ్లైఓవర్