హర్యానా ఎన్నికలు..ఆప్ మూడో జాబితా విడుదల
న్యూఢిల్లీ: హర్యానా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. మొన్నటి వరకూ హస్తం పార్టీతో దోస్తీ కోసం చర్చలు జరిపిన ఈ ఢిల్లీ పార్టీ.. ఆ చర్చలు ఫలవంతం కాలేదు. దీంతో అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే 29 మంది అభ్యర్థులను ప్రకటించిన ఆప్.. తాజాగా మూడో జాబితాను కూడా విడుదల చేసింది. 11 మంది అభ్యర్థులను ప్రకటించింది. దీంతో 90 అసెంబ్లీ స్థానాలకు గానూ ఇప్పటి వరకూ 40 స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించినట్లైంది.
గత ఐదు రోజులుగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పొత్తు విషయమై చర్చలు జరిగిన విషయం తెలిసిందే. అవి ఫలవంతం కాలేదు. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 10 స్థానాల్లో పోటీ చేయాలని ఢిల్లీ పార్టీ భావిస్తోంది. అయితే, కాంగ్రెస్ మాత్రం ఏడింటిని కేటాయించేందుకు మాత్రమే సిద్ధంగా ఉంది. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు లేనట్లు తేలింది. ఈ పరిణామాల అనంతరం ఆప్ సోమవారం 20 మంది అభ్యర్థులతో కూడి తొలి జాబితాను విడుదల చేసింది. ఆ తర్వాత మంగళవారం ఉదయం 9 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను ప్రకటించింది. ఇక ఇప్పుడు మూడో జాబితాలో భాగంగా 11 మందిని అభ్యర్థులుగా ప్రకటించింది.