తెలంగాణ చరిత్ర లో ఫిబ్రవరి 18కి ప్రత్యేకత
హైదరాబాద్: తెలంగాణ చరిత్ర లో ఫిబ్రవరి 18కి ప్రత్యేకత ఉన్నది. 2014, ఫిబ్రవరి 18వ తేదీన లోక్ సభ లో తెలంగాణ బిల్లు ఆమోదించబడింది. ఈ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. బిల్లు ఆమోదించిన తర్వాత ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కేసీఆర్ తో సంబురాలు చేసుకుంటున్న ఫొటోను హరీష్ రావు పోస్టు పెట్టారు.
పట్టుదల, నిబద్ధత ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం
కేసీఆర్ దార్శనికత కలిగిన నాయకుడి నాయకత్వంలో ప్రజా ఉద్యమం విజయం సాధించిన రోజు అని పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ధంగా జరిగే ప్రజాఉద్యమాలు విజయం సాధిస్తాయని చాటిన సందర్భమని, పట్టుదల, నిబద్ధత ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని నిరూపించిన రోజు అని పేర్కొన్నారు. హరీశ్ రావు షేర్ చేసిన ఫొటోలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, విఠల్ తదితరులున్నారు.
తెలంగాణ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన
2009 డిసెంబరు 9వ తేదీన తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ఆనాటి యూపీఏ సర్కారు ప్రకటన చేసింది. దీక్ష విరమించండి, మేం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని నాటి కేంద్ర మంత్రి చిదంబరం ఫోన్ చేసి కేసీఆర్కు చెప్పారు. అయినా కేసీఆర్ వినలేదు. తెలంగాణ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన వస్తేనే దీక్ష విరమిస్తానని స్పష్టం చేశారు. అప్పటికే 11 రోజులు అయ్యింది. ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. అయినా కేసీఆర్ పట్టు వదల్లేదు. దీక్షను కొనసాగించారు అని సోమవారం రోజు హరీశ్రావు గుర్తు చేసుకున్నారు.