చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ కు హరిరామ జోగయ్య లేఖలు..!

Hariram Jogaiah letter to Chandrababu, Pawan Kalyan..!

అమరావతి: ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తవుతోంది. ఈ రెండు నెలల్లో టీడీపీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు ప్రభుత్వ ప్రయత్నిస్తోంది. అయితే జనసేన ఎన్నికల సమయంలో ఇచ్చిన షణ్ముఖ వ్యూహం హామీలపై మాత్రం సైలెంట్ గా ఉంటోంది. దీనిపై డివ్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ సైతం నోరు మెదపడం లేదు. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు కాపు నేత హరిరామ జోగయ్య సీఎం చంద్రబాబు, పవన్ కు లేఖలు రాశారు.

ఎన్డీయే కూటమి రాష్ట్రంలో అమలు చేస్తున్న మ్యానిఫెస్టోలో టీడీపీ సూపర్ సిక్స్ పథకాలతో పాటు జనసేన హామీ ఇచ్చిన షణ్ముఖ వ్యూహం పథకాలనూ అమలు చేయాలని హరిరామజోగయ్య చంద్రబాబు, పవన్ ను కోరారు. సూపర్ సిక్స్ పథకాలతో పాటు షణ్ముఖ వ్యూహంలోనూ పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనవి ఉన్నాయని జోగయ్య తెలిపారు. కాబట్టి వీటినీ సూపర్ సిక్స్ తో పాటు అమలు చేయాలని జోగయ్య కోరారు.

జనసేన షణ్ముఖ వ్యూహం హామీల్లో ఒకటైన యువకులకు 10 లక్షల రూపాయల వరకూ సబ్సిడీ ఇచ్చే సౌభాగ్య పథకం బృహత్తరమైనదని హరిరామ జోగయ్య పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఈ పథకాన్ని కూడా అమలు చేయాలని యువత కోరుకుంటున్నట్లు తెలిపారు. సంపద చేకూర్చే ఈ పథకం వెంటనే అమలు చేయాలన్నారు. ఇప్పటివరకూ టీడీపీ సూపర్ సిక్స్ అమలుపై దృష్టిపెడుతున్న సర్కార్ కు ఇప్పుడు జోగయ్య రాసిన లేఖతో జనసేన షణ్ముఖ వ్యూహం హామీలనూ అమలు చేయాల్సిన పరిస్ధితి ఎదురు కానుంది.