హైదరాబాద్ నడిబొడ్డున పరువు హత్య ..
హైదరాబాద్ నడిబొడ్డున దారుణ హత్య చోటుచేసుకుంది. తమని కాదని ప్రేమించి పెళ్లి చేసుకుందని..కూతురి భర్త ను దారుణంగా నడి రోడ్డు ఫై దారుణంగా ఇనుపరాడ్లు, కత్తులతో దాడి చేసి చంపేశారు. వివరాల్లోకి వెళ్తే..రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన బిల్లాపురం నాగరాజు, మర్పల్లి సమీపంలోని ఘనాపూర్ గ్రామంలో నివసించే సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా.. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు వీరి పెళ్ళికి నిరాకరించడం తో జనవరి నెలలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.
హైదరాబాద్లో నివాసం ఉంటున్నట్లు ఆశ్రిన్ కుటుంబ సభ్యులు పసిగట్టడంతో కొత్తజంట రెండు నెలల కిందట విశాఖపట్నం వెళ్లి అక్కడే ఉన్నారు. ఎవరూ తమను వెంటాడటం లేదని భావించి.. అయిదు రోజుల కిందట మళ్లీ నగరానికి వచ్చారు. సరూర్నగర్లోని పంజా అనిల్కుమార్ కాలనీలో నివసిస్తున్నారు. వీరి కదలికలను గుర్తించిన ఆశ్రిన్ కుటుంబ సభ్యులు మాటువేశారు.
బుధవారం రాత్రి నాగరాజు, ఆశ్రిన్లు కాలనీలోంచి బయటకు రాగానే ఆశ్రిన్ సోదరుడు, అతడి స్నేహితుడు బైక్పై వారిని వెంబడించి దాడికి పాల్పడ్డారు. నాగరాజుపై ఇనుపరాడ్లు, కత్తులతో దాడి చేసి హత్య చేశారు. తన సోదరుడే భర్తను కిందపడేసి ఇనుపరాడ్డుతో తలపై విచక్షణారహితంగా కొట్టి చంపేయడంతో ఆ యువతి ఒక్కసారిగా షాక్కు గురైంది. రక్తపు మడుగులో భర్తను చూసి పెద్దగా రోదిస్తూ కేకలు వేసింది. దాడి జరుగుతున్న సమయంలో అశ్రిన్ తన భర్తను చంపవద్దంటూ కాళ్ల మీద పడి వేడుకున్నా కనికరించలేదని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.