పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెతను మళ్ళీ ఒకసారి ఊహించుకుంటే, దానికి తగిన ఉదాహరణగా నిలుస్తున్నాడు బాపట్ల జిల్లాకు చెందిన 12 ఏళ్ల చిన్నారి జోయెల్ విల్సన్. సాధారణంగా ఈ వయసులో పిల్లలు ఆటలతో కాలం గడుపుతారు. కానీ జోయెల్ మాత్రం సంగీతాన్ని తన జీవనశైలిగా మార్చుకుని, గిన్నిస్ వరల్డ్ రికార్డులో తన పేరు నమోదయ్యేలా చేశాడు.
స్వరాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన జోయెల్
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం బిడారుదిబ్బె గ్రామానికి చెందిన జోయెల్ విల్సన్ ప్రస్తుతం విజయవాడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. చిన్నతనంనుండి సంగీతంపై ఆసక్తితో ఎదిగిన జోయెల్, హలెల్ మ్యూజిక్ అకాడమీ ద్వారా కీబోర్డు శిక్షణ పొందడం ప్రారంభించాడు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అంతర్జాతీయ స్థాయి ఆన్లైన్ సంగీత పోటీల్లో, అతను కేవలం ఒక నిమిషంలో మూడు సరళి స్వరాలను కీబోర్డుపై ప్లే చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించాడు. ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల నుంచి 1090 మంది పాల్గొన్న ఈ పోటీలో, 1046 మంది మాత్రమే గిన్నిస్ రికార్డుకు అర్హులయ్యారు. అందులో జోయెల్ ఒకడు కావడం గర్వకారణం.
గిన్నిస్ గుర్తింపు
ఈ ఘనతకు గుర్తింపుగా గిన్నిస్ సంస్థ నుంచి ప్రశంసా పత్రం అందింది. అంతేకాదు, లండన్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ లో ప్రత్యేక శిక్షణకు ఎంపికై, ప్రపంచస్థాయిలో సంగీతాన్ని మరింత లోతుగా నేర్చుకునే అవకాశం పొందాడు. అతని తల్లిదండ్రులు విల్సన్ బాబు మరియు ప్రత్యూష, జోయెల్ విజయానికి నిలువెత్తు ఆదర్శంగా నిలిచారు. చిన్న వయస్సులోనే తమ ఊరి పేరును గిన్నిస్ బుక్లో ఎక్కించిన బాలుడిపై స్థానికులు ప్రశంసల జల్లు కురింపించారు. రానున్న రోజుల్లో ప్రపంచ సంగీతంలో జోయెల్ తనదైన ముద్ర వేయాలని కోరుకుంటున్నారు.
Read also: Andhrapradesh: ఏపీలో నామినేటెడ్ పోస్టులకు కొత్త జాబితా విడుదల