54వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం తేదీ ఖరారు

GST Council meeting on September 9

న్యూఢిల్లీ: జీఎస్టీ మండలి తదుపరి సమావేశం తేదీ ఖరారైంది. సెప్టెంబర్‌ 9న కౌన్సిల్‌ భేటీ కానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో దిల్లీలో కౌన్సిల్‌ 54వ సమావేశం జరగనుందని జీఎస్టీ కౌన్సిల్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.చివరి సారిగా జూన్‌ 22న భేటీ అయ్యింది. తదుపరి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జీఎస్టీ విషయంలో అత్యున్నత నిర్ణయాక మండలి అయిన జీఎస్టీ కౌన్సిల్‌లో కేంద్ర ఆర్థిక మంత్రితో పాటు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు. వచ్చే నెల జరగబోయే ఈ సమావేశంలో రేట్ల హేతుబద్ధీకరణపై చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పన్ను స్లాబులను కుదించే అవకాశం ఉంది. గత సమావేశంలోనే ఈ మేరకు నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. బిహార్‌ డిప్యూటీ సీఎం సుమంత్‌ చౌదరి దీనిపై ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. బీమాపై జీఎస్టీ తొలగించాలన్న డిమాండ్‌ తెరపైకి వచ్చిన వేళ ప్రస్తుత ఉన్న జీఎస్టీని తగ్గించే అవకాశమూ ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి.