తెలంగాణలో ప్రైవేట్ రంగంలో రాకెట్ తయారీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్, రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్, మరియు టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ రాష్ట్రం, అంతరిక్ష రంగంలో ప్రత్యేక గుర్తింపును సాధించబోతోందని నిపుణులు భావిస్తున్నారు.
దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం రేవంత్ రెడ్డి, స్కైరూట్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణను ప్రైవేట్ అంతరిక్ష కార్యకలాపాల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. స్కైరూట్ సంస్థ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ, ప్రపంచ స్థాయిలో ఉత్తమ రాకెట్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయబోతోందని తెలిపారు.
హైదరాబాద్ను సాంకేతికత మరియు పరిశోధన రంగంలో ముఖ్య కేంద్రముగా అభివృద్ధి చేయడంలో స్కైరూట్ ఏరోస్పేస్ కీలకపాత్ర పోషించనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి మెరుగైన పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. స్కైరూట్ కంపెనీ ఇప్పటికే భారతదేశం తొలి ప్రైవేట్ రాకెట్ “విక్రమ్-ఎస్” విజయవంతంగా నింగిలోకి పంపి ప్రతిభను చాటింది. ఈ నూతన యూనిట్ ద్వారా ఆ సంస్థ మరింత ఆధునిక రాకెట్లను తయారు చేయనుంది. రాకెట్ తయారీ, పరీక్షల ప్రక్రియలన్నీ తెలంగాణలోనే జరగడం గర్వకారణమని సీయం రేవంత్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఇటు ఐటీ రంగం, అటు అంతరిక్ష పరిశోధనలో దూసుకుపోతున్న తరుణంలో, స్కైరూట్ సంస్థతో ప్రభుత్వ భాగస్వామ్యం రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి మార్గదర్శకమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.