పలు పథకాలకు పేర్లు మార్చిన చంద్రబాబు ప్రభుత్వం

ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం మారిందంటే..గత ప్రభుత్వ పథకాలలో మార్పులు చేర్పులు చేయడం సహజం. ఇప్పుడు ఏపీలో కూడా అదే జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం..గత వైసీపీ తీసుకొచ్చిన పథకాల పేర్లు మారుస్తుంది. 2019 ఏడాదికి ముందు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నట్లయితే వాటికి పాత పేర్లను పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. 2019 – 24 మధ్య ప్రవేశపెట్టిన కొత్త పథకాలకు పేర్లను తొలగించాలని సూచించింది. మంత్రి డొలా బాల వీరాంజనేయ స్వామి ఆదేశాల మేరకు పేర్లని మారుస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. అదేవిధంగా పార్టీల రంగులు, జెండాలతో ఉన్న పాసుపుస్తకాలు, లబ్ధిదారుల కార్డులు సర్టిఫికెట్లు జారీని వెంటనే నిలిపివేయాలని సూచించింది.

జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను ఇకపై ‘పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్’ గా పిలుస్తారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి’గా పేరు మార్చారు. వైఎస్సార్ కల్యాణమస్తు పథకానికి ‘చంద్రన్న పెళ్లి కానుక’గా పేరు మార్చారు. వైఎస్సార్ విద్యోన్నతి పథకానికి ‘ఎన్టీఆర్ విద్యోన్నతి’ అని పేరు పెట్టారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పథకం పేరును కూడా మార్చారు. ఈ పథకానికి ‘సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకం’గా నామకరణం చేశారు.