శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ

తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ..మంగళవారం ఉదయం యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం యాదాద్రి ఆలయానికి చేరుకున్న గవర్నర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ నారసింహుడికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత గవర్నర్‌కు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు స్వామివారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందచేశారు. గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ మంగళ, బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో పర్యటించనున్నారు.

మరికాసేపట్లో గంటలకు ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో 25 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు పొందిన రచయితలు, కళాకారులతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వెంకటాపూర్‌ మండలం పాలంపేట గ్రామంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి చేరుకొని పూజలు నిర్వహించిన అనంతరం సరస్సును సందర్శించనున్నారు.

అక్కడి నుంచి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురంలోని కోటగుళ్లను సందర్శించి పూజలు చేస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపురంలోని లక్నవరం సరస్సు వద్దకు చేరుకొని హరిత రిసార్ట్‌లో ఇతర అధికారులతో కలిసి రాత్రి బస చేయనున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు లక్నవరం నుంచి హనుమకొండ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 29న మధ్యాహ్నం 2.20 గంటలకు ఆలేరు మండలంలోని కొలనుపాక జైన దేవాలయాన్ని, సోమేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు భువనగిరి పట్టణ పరిధిలోని స్వర్ణగిరి ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 5.15 గంటలకు భువనగిరి కలెక్టరేట్‌లో రచయితలు, కళాకారులు, ప్రముఖులు, రాష్ట్ర జాతీయ అవార్డు గ్రహీతలతో భేటీ కానున్నారు. గవర్నర్ పర్యటన నిమిత్తం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.