ఏపీ లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటుగా ప్రైవేటు రంగంలో కూడా యువతకు పెద్దగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగా ఏపీ ప్రభుత్వం పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పనకు అవకాశం కల్పిస్తోంది. ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం ఒరాకిల్, ష్నైడర్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా యువతకు ఉచితంగా ఒరాకిల్ క్లౌడ్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
వివరాలు
రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో యువతకు శిక్షణనిచ్చేందుకు ఒరాకిల్ కంపెనీతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ఒప్పందం చేసుకుంది. ఈమేరకు మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉండవల్లి నివాసంలో సోమవారం నాడు ఒరాకిల్, ఏపీఎస్ఎస్డీసీ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ద్వారా ఎంపికచేసిన యువతకు ఒరాకిల్ యూనివర్సిటీ లెర్నింగ్ సబ్స్క్రిప్షన్ కంటెంట్ ఉచితంగా లభిస్తుంది. మహిళలు, ఆర్థికంగా వెనకబడిన వర్గాల యువతకు ఒరాకిల్ క్లౌడ్ నైపుణ్యాలు అందించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం.దీనిలో భాగంగా మొదటి సంవత్సరం లక్ష, రెండు, మూడు సంవత్సరాల్లో ఒక్కో ఏడాదికి లక్షన్నర మంది చొప్పున మొత్తం 3 ఏళ్లలో 4 లక్షల మందికి ఒరాకిల్ మైలెర్న్ డిజిటల్ ప్లాట్ఫాంలో శిక్షణనిస్తారు. ఇందుకోసంఅభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్రీగానే ట్రైనింగ్ ఇస్తారు. ఇక ఒరాకిల్ అందించే సేవల కోసం ఏపీఎస్ఎస్డీసీ ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందించనుంది.

పరిశ్రమ
ఎలక్ట్రానిక్స్, హరిత ఇంధనం, నిర్మాణ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు ష్నైడర్ ఎలక్ట్రిక్ కంపెనీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ఒప్పందం కుదుర్చుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రతిభావంతులైన యువతను తయారుచేయడమే ఈ ఒప్పందం ముఖ్య లక్ష్యం.దీనిలో భాగంగా 2027 మార్చి వరకు ప్రభుత్వ ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలు, న్యాక్ శిక్షణ కేంద్రాల్లో 20 అధునాతన ట్రైనింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో సుమారు తొమ్మిది వేల మంది యువతకు శిక్షణనిస్తారు. మంత్రి లోకేశ్ విజ్ఞప్తి మేరకు మంగళగిరిలో రూ.15 కోట్లతో ష్నైడర్ ఎలక్ట్రిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. ఈ రెండు కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల యువతకు స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పనకు దారి చూపనున్నారు.
Read Also: Andhra Pradesh: ఏపీలో కొత్త రైల్వే లైన్ ఎక్కడంటే?