ఏపీ ప్రభుత్వం సరిహద్దులో దేశం కోసం పోరాడుతున్న సైనికుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పంచాయతీల్లో దేశ రక్షణ సిబ్బంది ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాకిస్థాన్తో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న సమయంలో ఈ ప్రకటన రావడం విశేషం. గతంలో మాజీ సైనికులకు, విధుల్లో ఉన్న ఆర్మీ సిబ్బందికి మాత్రమే ఈ అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు విధుల్లో ఉన్న రక్షణ సిబ్బందికి కూడా ఈ సౌకర్యం కల్పించారు. కొత్తగా తీసుకున్న నిర్ణయం ప్రకారం మాజీ సైనికులు, ప్రస్తుతం విధుల్లో ఉన్న డిఫెన్స్ సిబ్బంది, వారి భార్య లేదా భర్త పేరు మీద ఇల్లు ఉంటే ఆస్తి పన్ను ఉండదు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.సైనికుల సంక్షేమం కోసం రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. మాజీ సైనికులకు, ఆర్మీ సిబ్బందికి మాత్రమే ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల వస్తున్న సమస్యలను ఆ లేఖలో వివరించింది. దీనిని పరిశీలించిన ప్రభుత్వం 2003 నవంబర్ 10న జారీ చేసిన ఉత్తర్వులను(Orders) సవరించింది. ఆర్మీ అనే పదం స్థానంలో డిఫెన్స్ అనే పదాన్ని చేర్చింది. మాజీ సైనికులు లేదా విధుల్లో ఉన్న రక్షణ సిబ్బంది, వారి జీవిత భాగస్వాముల్లో ఎవరికైనా ఒకరికే ఆస్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. భార్య, భర్తల పేర్ల మీద రెండు ఇళ్లు ఉన్నా ఒక ఇంటికి మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుంది. ఒక ఇల్లు ఎన్ని అంతస్తులు ఉన్నా, దానికి ఒకటే డోర్ నంబర్ ఉంటే పన్ను రాయితీ ఇస్తారు. ఆ ఇంట్లో రక్షణ సిబ్బంది కుటుంబ సభ్యులు నివసిస్తూ ఉండాలి,దానిని అద్దెకు ఇవ్వకూడదు.

సైనికులు
ఒక పంచాయతీలో మొత్తం ఇళ్లలో 10 శాతం కంటే ఎక్కువ ఇళ్లు రక్షణ సిబ్బందికి చెందినవి అయితే అలాంటి చోట్ల ఆస్తి పన్నులో 50 శాతం మాత్రమే మినహాయింపు ఇస్తారు. 10 శాతం కంటే తక్కువ ఇళ్లు ఉంటే 100 శాతం మినహాయింపు వర్తిస్తుంది. “మాజీ సైనికులు, విధుల్లో ఉన్న రక్షణ సిబ్బంది, వారి జీవిత భాగస్వాముల్లో ఎవరైనా ఒకరికే ఆస్తిపన్ను (Property tax)మినహాయింపు లభిస్తుంది” అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై సైనికులు, మాజీ సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు దేశ రక్షణలో అమరుడైన ఏపీకి చెందిన జవాన్ మురళీనాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాంనాయక్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. ’25 ఏళ్ల వయసులో మాతృభూమి కోసం ప్రాణాలర్పించి అమరుడైన మురళీ త్యాగాన్ని దేశమంతా గుర్తుపెట్టుకుంటుంది. మీ ఆవేదన తీర్చలేనిది. అయినా ధైర్యంగా ఉండండి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా అండగా ఉంటాం అన్నారు.
Read Also: Andhra Pradesh: జూన్ 2 నుండి విజయవాడ బెంగళూర్ విమానసేవలు