ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖపై వైసీపీ అధినేత జగన్ చేస్తున్న విమర్శల్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇవాళ తీవ్రంగా ఖండించారు. జగన్ చేస్తున్న వ్యాఖ్యలు అసత్యాలతో నిండి ఉన్నాయని, ప్రజలలో అపోహలు కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.
జగన్ హయాంలో విద్యుత్ రంగ విధ్వంసం
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో విద్యుత్ రంగం తీవ్ర నష్టాల్లోకి వెళ్లిందని మంత్రి పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖపై రూ.1.29 లక్షల కోట్ల రుణ భారం మోపబడిందని, షార్ట్ టైం పవర్ పర్చేస్ పేరిట ఒక్క ఏడాదిలోనే రూ.10,000 కోట్ల మేర ప్రజాధనాన్ని ఖర్చు చేశారని ఆరోపించారు. ఇంకా, వైసీపీ ప్రభుత్వం కాలంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని గుర్తు చేశారు.

తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదారి పట్టించకండి
యాక్సిస్, బ్రూక్ ఫీల్డ్ కంపెనీతో కూటమి ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలపై అవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసిన సాక్షి మీడియాను అడ్డం పెట్టుకుని జగన్ మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం లో సెకీ నుంచి రూ.2.49కి విద్యుత్ కొనుగోలు చేసామనేది పచ్చి అబద్ధమని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. విద్యుత్ సరఫరా నష్టాలు , ఇతర ఖర్చులన్నీ కలిపితే యూనిట్ కు రూ.5 పైనే ఖర్చు చేయాల్సి వస్తుందని మంత్రి వివరించారు.
రైతులకు లాభాలు – యువతకు ఉపాధి
రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి మండిపడ్డారు. అత్యధిక విద్యుత్ వినియోగం జరిగే సమయంలో ఒత్తిడిని తట్టుకునేందుకు, ప్రజలకు నిరంతరాయ విద్యుత్ అందించేందుకు యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్ ఒప్పందాలు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. ఈ ఒప్పందాలతో రాయలసీమ ప్రాంతంలో 400 మోగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో పాటు రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఈ ఒప్పందం ద్వారా పీక్ అవర్స్ లో కూడా యూనిట్ రూ.4.60కే విద్యుత్ దొరుకుతుందని విద్యుత్ మంత్రి స్పష్టం చేశారు. జగన్ రెడ్డి హయాంలో 2022 లో రూ.5.12కు నాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే..తమ ప్రభుత్వం యూనిట్ విద్యుత్ ను రూ.4.60కి తగ్గించి ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. 1,700 ఎకరాలను రైతుల నుంచి తీసుకుని వారికి ఏడాదికి రూ.31 వేలు కౌలు అందిస్తున్నామని వెల్లడించారు. అంతేగాక రాష్ట్రానికి యాక్సిస్ ఎనర్జీ నుంచి 9 శాతం జీఎస్టీ రూపంలో ఆదాయం లభిస్తుందన్నారు.
చంద్రబాబు దృష్టి – పెట్టుబడులపై నమ్మకం
యాక్సిస్ ఎనర్జీ తన పెట్టుబడులను ఏపీలో పెట్టిందని, వీటి ద్వారా విద్యుత్ కొనుగోళ్లు చేస్తుండటంతో విద్యుత్ సరఫరా నష్టాలు లాంటివి ఉండవని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. ఇటువంటి ఒప్పందాల ద్వారా విద్యుత్ ఛార్జీలు తగ్గించి ప్రజలపై భారం లేకుండా చేయాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన అన్నారు. . పెట్టుబడిదారుల్ని తరిమికొట్టిన చరిత్ర జగన్ ది అయితే, పెట్టుబడులు ఆహ్వానించి రాష్ట్రానికి ఆదాయం సమకూరుస్తూ ఉపాధి కల్పిస్తున్న ఘనత చంద్రబాబుది అన్నారు.
Read also: TTD: టీటీడీ భక్తులు అసంతృప్తితో వెళ్లిపోతున్నారు:వెంకయ్య చౌదరి