భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

ఎగువ ప్రాంతాల్లో, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఈరోజు ఉదయానికి గోదావరి నీటి మట్టం 21 అడుగులకు చేరింది. ఎగువన ఉన్న తాలిపేరు ప్రాజెక్టు నుంచి వరద నీటిని అధికారులు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గోదావరిలో నీటిమట్టం పెరుగుతుంది.

దుమ్ముగూడెం మండలంలోని సీత వాగుతో పాటు, గుబ్బల మంగి వాగులు, ఉద్ధృతంగా ప్రవహిస్తూ నదిలో కలుస్తున్నాయి. మరోవైపు భద్రాచలం నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చర్ల, దుమ్ముగూడెం మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి పైకి మురుగునీరు చేరడంతో వాహనదారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే ప్రధాన రహదారి పైకి మురుగునీరు చేరుతోందని స్థానికులు వాపోతున్నారు.