మహిళలను తీవ్ర ఇబ్బందికి గురిచేస్తున్న క్యాన్సర్ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా క్యాన్సర్లను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ను ఐదు నుంచి ఆరు నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి ప్రతాప్రరావు జాదవ్ మీడియాకు తెలిపారు. తొమ్మిది నుంచి 16 సంవత్సరాల వయస్సు గల బాలికలకు ఈ వ్యాక్సిన్లు వేస్తారని ఆయన తెలిపారు..
మహిళల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న క్యాన్సర్లను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ను ఐదారు నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం ఆయుష్ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాధవ్ మంగళవారం వెల్లడించారు. తొమ్మిది నుంచి 16 యేళ్ల వయస్సు గల అమ్మాయిలకు మాత్రమే ఈ వ్యాక్సిన్ వేసేందుకు అర్హులుగా పేర్కొన్నారు. ఈ మేరకు మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. క్యాన్సర్ వ్యాక్సిన్కు సంబంధించిన పరిశోధనలు దాదాపు పూర్తి కావొచ్చాయని, ట్రయల్స్ కొనసాగుతున్నాయని తెలిపారు.

స్కానింగ్ పరీక్షలు
దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోంది. మహిళలను ప్రభావితం చేసే క్యాన్సర్లకు వ్యాక్సిన్పై పరిశోధన దాదాపు పూర్తయింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. 30 ఏళ్లు పైబడిన మహిళలు ఆసుపత్రుల్లో స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు డేకేర్ క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి జాదవ్ అన్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మునుముందు రోజుల్లో మహిళల్లో వచ్చే రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్లను నియంత్రించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్లు
క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మందులపై కస్టమ్స్ సుంకాన్ని కూడా ప్రభుత్వం మాఫీ చేసిందని ఆయన అన్నారు. ఈ వ్యాక్సిన్ ఏ క్యాన్సర్లను నయం చేస్తుందని విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ.. రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్లు నయం చేయవచ్చని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఆయుష్ సౌకర్యాలుగా మార్చడం గురించి ప్రశ్నించగా ఆసుపత్రులలో ఆయుష్ విభాగాలు ఏర్పాటు చేశామని, ప్రజలు ఈ సౌకర్యాలను పొందవచ్చని ఆయన వివరించారు. దేశంలో ఇలాంటి 12,500 ఆరోగ్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం వీటి సంఖ్యను మరింత పెంచుతుందని ఆయన అన్నారు.