రాజ్యసభ వైపు గల్లా జయదేవ్ చూపు..?
గత ఎన్నికలకు ముందు రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గుంటూరు మాజీ ఎంపీ, టీడీపీ పార్టీ సీనియర్ నేత గల్లా జయదేవ్ పొలిటికల్ ఫ్యూచర్పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. స్వతహాగా పారిశ్రామిక వేత్త అయిన గల్లా జయదేవ్ గత ప్రభుత్వంలో తీవ్రమైన ఒత్తిళ్లు ఎదురవ్వడంతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అలా ప్రకటించిన మూన్నెల్లలోనే ఎన్నికలు జరగడం.. టీడీపీ తిరుగులేని విజయం సాధించడంతో గల్లా జయదేవ్లో అంతర్మథనం మొదలైందని టాక్ వినిపిస్తోంది.
ఎన్నికల్లో తెరవెనుక రాజకీయం చేసిన జయదేవ్.. పార్టీ అధికారంలోకి రాగానే ఢిల్లీలో చాలా హంగామా చేయడంతో ఆయనకు పొలిటికల్ ఇంట్రెస్ట్ తగ్గలేదని తేలిపోయింది. ఆయన హడావుడి చూసిన వారంతా గల్లా మళ్లీ రీఎంట్రీ ఇస్తారా? అనే డౌట్ ఎక్స్పెక్ట్ చేశారు. ఇక ఆయన ఆసక్తిని గమనించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తానని ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు. తనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరుతున్నట్లు సమాచారం. ఆయనకు ఉన్న పరిచయాల దృష్ట్యా తొలుత ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 2026లో ఖాళీ అయ్యే రాజ్య సభ స్థానానికి ఆయనను ఎంపిక చేస్తారని పేర్కొంటున్నాయి.