కేంద్ర బడ్జెట్ నుంచి ఢిల్లీకి రూ. 10,000 కోట్లు కేటాయించాలి: అతిషి
న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజలు చెల్లించిన పన్నుల సమాహారమే కేంద్ర బడ్జెట్ అని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి పేర్కొన్నారు. ఈ పన్నుల్లో ఢిల్లీ వాటా అత్యధికమని ఆమె తెలిపారు. ఢిల్లీ వాసులు ఆదాయ పన్ను కింద రూ. రెండు లక్షల కోట్లు పైగా చెల్లిస్తారని, రూ. 25,000కుపైగా సెంట్రల్ జీఎస్టీ కింద ఢిల్లీ నుంచి సమకూరుతుందని మంత్రి వివరించారు.
ఢిల్లీ ప్రజలు రెండున్నర లక్షల కోట్లకుపైగా పన్నులు చెల్లిస్తున్నారని, ఇందులో కొంతభాగం తిరిగి దేశ రాజధాని నగరానికి దక్కడం తమ హక్కని ఆమె పేర్కొన్నారు. ఈ రెండున్నర లక్షల కోట్లలో ఐదు శాతం ఢిల్లీకి కేటాయించాలని అతిషి డిమాండ్ చేశారు. ఢిల్లీలో మౌలిక వసతులు, విద్యుత్, రోడ్డు రవాణా వంటి మౌలిక రంగ ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్ నుంచి రూ. 10,000 కోట్లు కేటాయించాలని ఆమె కోరారు.
మరోవైపు హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో 90 అసెంబ్లీ స్ధానాల్లో పోటీ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సిద్ధమవుతోందని ఆప్ హరియాణ చీఫ్ సుశీల్ గుప్తా వెల్లడించారు. పోలింగ్ బూత్ స్ధాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు కసరత్తు సాగుతున్నదని చెప్పారు. హరియాణ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ను కోరుకుంటున్నారని అన్నారు. ఢిల్లీ, పంజాబ్ తరహాలో హరియాణకు 24 గంటల విద్యుత్, నీటి సరఫరాను ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.