ప్రతి పౌరుడికి ఉచిత వైద్యం..సీఎం రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో ప్రతి పౌరుడికి ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్ కార్డు జారీ చేస్తామని, ప్రొఫైల్ కార్డులో లబ్ధిదారుల బ్లడ్ గ్రూప్ నుంచి వారికున్న ఆరోగ్య సమస్యలను పొందుపరుస్తామని స్పష్టం చేశారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుల వలన వైద్యం అందించడం సులభం అవుతోందని అన్నారు. విద్య, వైద్యం అందుబాటులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఫార్మా రంగంపై ఎప్పుడు చర్చ వచ్చినా.. అందులో కచ్చితంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఉంటుందని.. ఇందుకు కారణం దివంగత ప్రధాని ఇందిరా గాంధీ దూరదృష్టేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చొరవతోనే తెలంగాణలో ఐటీ అభివృద్ధి చెందిందని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఫార్మా విలేజ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో మెడికల్ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. త్వరలోనే వరంగల్‌కు ఎయిర్ పోర్టు రాబోతుందని.. ఓరుగల్లులో హెల్త్, ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.