మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు రాజీవ్ అరెస్టు..!
అమరావతి: అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీమంత్రి జోగి రమేశ్ ఇంట్లో ఇవాళ ఉదయం ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. 15 మందితో కూడిన ఏసీబీ బృందం ఈ ఉదయం 5 గంటలకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి చేరుకుని తనిఖీలు నిర్వహించింది. ఇంటిని మొత్తాన్ని జల్లెడ పట్టిన ఏసీబీ అధికారుల బృందం పలు రికార్డులు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ఈ కేసులో కీలక వ్యక్తి అయిన జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాజీవ్.. ఇది ప్రభుత్వ కక్షపూరిత చర్యగా పేర్కొన్నారు. తన తండ్రిపై ఉన్న కక్షతోనే తనను అరెస్ట్ చేస్తున్నారంటూ ఆరోపించారు. అందరూ కొనుగోలు చేసినట్లే తాము భూములు కొన్నామన్న ఆయన.. అందులో తప్పేముందో తనకు అర్థం కావడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామన్నారు.
కాగా, సీఐడీ జప్తులో ఉన్న భూములను కొనుగోలు చేసి విక్రయించినట్టు జోగి రమేశ్ పై ఆరోపణల నేపథ్యంలో ఇటీవల కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.