పిన్నెల్లి అరెస్ట్ ఫై మాజీ మంత్రి అంబటి కామెంట్స్

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పోలీసులు పిన్నెల్లిని అదుపులోకి తీసుకోలేదని, స్వచ్ఛందంగా ఆయనే లొంగిపోయారంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందే పిన్నెల్లిని ఓడించాలని ప్లాన్ చేశారని.. ఆ పథకం ప్రకారమే పనులు కానిచ్చారని ఆరోపించారు. పిన్నెల్లి కుటుంబాన్ని వేధించాలని చూస్తున్నారని.. కుట్రపూరితంగా ఆయనపై కేసులు పెట్టారని పేర్కొన్నారు. వైసీపీ నాయకులపై కూడా కేసులు పెడతారని, అప్పుడు తాము లీగల్‌గా పోరాడుతామని అంబటి రాంబాబు తెలిపారు. వైసీపీ చాలా బలమైన రాజకీయ పార్టీ అని, తమపై ఎన్ని కేసులు పెట్టినా మరింతగా రాటుదేలుతామే తప్ప భయపడేదే లేదని అన్నారు.

అసలు ఏంజరిగిందంటే..

మే 13వ తేదీన పోలింగ్‌ రోజు రెంటచింతల మండలంలోని పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో పిన్నెల్లి ఓ ఈవీఎంను ధ్వంసం చేసిన విషయం అందరికీ తెలిసింది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వడం, ఆ వీడియో బయటకు రావడంతో.. పిన్నెల్లిపై 506, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఎన్నికల వేళ పాల్పడిన నేరాలకు సంబంధించి హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించడంతో పిన్నెల్లి ఇన్నాళ్లూ అరెస్ట్ కాలేదు. ఇటీవల ముందస్తు బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో.. పోలీసులు పిన్నెల్లిని నరసరావుపేటలో అదుపులోకి తీసుకున్నారు.