పదేళ్ల తర్వాత తొలిసారి ఆ స్థానంలో కూర్చున్న నేతగా రాహుల్ రికార్డు
న్యూఢిల్లీ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరుదైన ఘనత సాధించారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తొలి ప్రతిపక్ష నేతగా చరిత్ర సృష్టించారు. కాగా, 78వ స్వాతంత్య్ర వేడుకలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఎర్రకోట వద్ద నిర్వహించిన వేడుకల్లో ప్రతిపక్ష హోదాలో రాహుల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెల్లని కుర్తా ధరించి ఒలింపిక్ పతక విజేతలతో కలిసి కూర్చుని అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న రాహుల్.. పదేళ్ల తర్వాత స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న తొలి ప్రతిపక్ష నేతగా రికార్డులకెక్కారు.
కాగా, గత కొన్నేళ్లుగా లోక్సభలో ప్రతిపక్ష నేత హోదా పొందేందుకు అవసరమైన స్థానాలు ఏ రాజకీయ పార్టీ సాధించలేదకపోయింది. దీంతో 2014 నుంచి 2024 వరకూ ఈ పోస్టు ఖాళీగానే ఉంది. ఇక ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుని 99 స్థానాలు గెలుచుకుంది. దీంతో లోక్సభలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. ఈ క్రమంలో లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నికయ్యారు. ఈ హోదాలోనే ఇవాళ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని.. పదేళ్ల తర్వాత ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న తొలి ప్రతిపక్ష నేతగా రాహుల్ నిలిచారు.