బుడమేరుకు ఆకస్మిక వరద ముప్పు!

బుడమేరు పరీవాహకంలో కురుస్తున్న వర్షాలతో ఏ క్షణంలోనైనా వరద వచ్చే అవకాశం ఉందని విజయవాడ నీటిపారుదల అధికారులు తెలిపారు. గండ్ల పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయన్నారు. ఒకవేళ వరద వస్తే ఏలప్రోలు, రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి కాలనీ, అజిత్ సింగ్ నగర్ తదితర ప్రాంతాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వారు కోరారు.

సెప్టెంబర్ 8వ తేదీ ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో బుడమేరుకు వరద నీరు వచ్చి చేరుతోంది. పరీవాహక ప్రాంతంలో నిరంతరంగా మరియు భారీ వర్షాలు కురుస్తుండటంతో పాటు క్యాచ్‌మెంట్‌ ఏరియాలో భారీ వర్షపాతం అంచనా వేసినందున, బుడమేరు నదికి ఎప్పుడైనా భారీ మరియు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ప్రస్తుతం, వెలగలేరు రెగ్యులేటర్ 2.7 అడుగుల ఎత్తులో నీరు ఉంది. బుడమేరు డైవర్షన్‌ ఛానల్‌కు గండ్లు పడటం, వరద ముంపు ముంచెత్తడం వంటి ఘటనల నేపథ్యంలో మరోసారి వరద వస్తుందని అంచనా వేస్తున్నారు. బుడమేరు ప్రవాహాన్ని దిగువకు విడుదల చేయాల్సి ఉండటంతో ముందే అలర్ట్‌ జారీ చేశారు. బుడమేరు ప్రవాహం ఏడు అడుగుల ఎత్తుకు చేరుతుందని అంచనా వస్తున్నారు. వరద దిగువకు విడుదల చేస్తే బుడమేరు పక్కనే ఉన్న ఈలప్రోలు, రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి కాలనీ, సింగ్ నగర్, గుణదల, ఎన్టీఆర్ జిల్లా రామవరప్పాడు తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు.

వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను తక్షణమే తరలించి, అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని, సంబంధిత అధికారులు మరియు ప్రజలందరినీ అప్రమత్తం చేయాలని ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు. తాజా హెచ్చరికల నేపథ్యంలో ఉదయం నుంచి పోలీసులు, రెవిన్యూ యంత్రాంగం అయా ప్రాంతాల్లో వరద హెచ్చరికలతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.