పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కూల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశనగర్‌లోని సోఫా తయారీ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మూడుంతస్తుల బిల్డింగ్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో సోఫా తయారీ గోదాం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో అంటుకున్న మంటలు ఫస్ట్ ఫ్లోర్‌కు క్షణాల్లో వ్యాపించాయి. అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఈ అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన శ్రీనివాస్ (40), నాగరాణి (35), హరిణి (6), శివప్రియ (10) కి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీనివాస్, తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి సోఫా తయారీ గోదాంలో పనిచేస్తున్నారు. గోదాం ఉన్న ఇంటిలోనే ఒక గదిలో నివసిస్తున్నారు. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.