ఈ సంవత్సరం నుండే రైతు కూలీలకు ఆర్థిక సాయం: భట్టి

Financial assistance to farmers laborers from this year itself: Bhatti

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2024-25 ను ప్రవేశ పెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏడాది నుంచే రైతు కూలీలకు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటన చేశారు. రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఏడాదికి 12000 చోప్పున రైతు కూలీలకు ఆర్థిక సాయం చేస్తామని వెల్లడించారు. రూ.2 లక్షల రుణం ఉన్న రైతులకు త్వరలో మాఫీ చేస్తామన్నారు. రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే శిలాశాసనమే అన్నారు.

రైతు కూలీలకు ఈ ఏడాది నుంచే ఆర్థిక సాయం చేస్తామని కూడా వెల్లడించారు భట్టి. 33 రకాల వరి ధాన్యం పండించిన రైతులకు ఈ ఏడాది నుండి.. 500 బోనస్ ఇస్తామన్నారు. లక్ష ఎకరాల ఆయిల్ ఫార్మ్ సాగు లక్ష్యమని చెప్పారు. మహిళా సంఘాల సభ్యులకు 10 లక్షల జీవిత భీమా కల్పిస్తామని కూడా వివరించారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. త్వరలో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామన్నారు. రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలన్నది తమ లక్ష్యమన్నారు.

గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందన్నారు. పదేళ్లలో అప్పులు పదిరెట్లు పెరిగాయని పేర్కొన్నారు. అప్పులు వామనావతారం లెక్క పెరిగాయన్నారు. అధికారంలోకి వస్తే బంగారు తెలంగాణ చేస్తామని ప్రగల్భాలు పలికి అప్పులపాలు చేశారన్నారు. ఓ వైపు అప్పులు పెరిగిపోగా… మరోవైపు బిల్లులు, బకాయిలు పెరిగిపోయాయన్నారు. గత పదేళ్ల అస్తవ్యస్త పాలనకు తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో చరమగీతం పాడారన్నారు.

దశాబ్దకాలంలో తెలంగాణ పురోగమించలేదన్నారు. ఒంటెత్తు పోకడలతో ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. జీతాలు, పెన్షన్ల చెల్లింపులు కూడా చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి చాలా క్లిష్టంగా ఉందన్నారు. దుబారా ఖర్చు ఆపేసి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామన్నారు. ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ఆపడం లేదన్నారు.